హుజూరాబాద్ టౌన్, జనవరి 6 : తనను భార్యగా గుర్తించి, ఇంట్లోకి అనుమతించాలని 41 రోజులుగా భర్త ఇంటి ఎదుట ఆందోళన చేసినా ఫలితం దక్కలేదు. చివరికి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా.. చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు వదిలింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి టౌన్ సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఏపీ లోని కడప జిల్లాకు చెందిన సుహాసిని, హుజూరాబాద్ వాసి నరహరి సుజిత్రెడ్డి ఏడాది క్రితం ప్రేమ పెండ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు కాపురం చేసిన సుజిత్రెడ్డి తర్వాత ముఖం చాటేయడంతో 41 రోజులుగా పట్టణంలోని సుజిత్రెడ్డి ఇంటి ఎదుట సుహాసిని ఆందోళన చేపట్టింది. స్పందన లేకపోవడంతోపాటు సుజిత్రెడ్డి వేరొక యువతిని రహస్యంగా పెండ్లి చేసుకోవడంతో మనస్తాపానికి గురైంది. తనకు న్యాయం జరగడం లేదంటూ సూసైడ్ నోట్ రాసి బుధవారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స పొందుతూ గురువారం మరణించింది. తన చావుకు భర్త, అతని రెండో భార్య, అత్త, మామ, మరిది కారణమంటూ ఆమె తన సూసైడ్ నోట్లో పేరొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.