మామడ, సెప్టెంబర్ 19 : ఓ మహిళ ఇంటి నుంచి తప్పిపోయి.. పదేండ్ల తరువాత తిరిగొచ్చింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామంలో చోటుచేసుకున్నది. పొన్కల్కు చెందిన రాజారపు నడ్పి బుచ్చవ్వ మతిస్థిమితం కోల్పోయి 2013లో ఇంటి నుంచి తప్పిపోయింది. ఆ సమయంలో ఆమెకు 49 ఏండ్లు. సిక్కిం రాష్ట్రంలోని గ్యాంగ్టక్లోని వృద్ధాశ్రమంలో ఉంటుంది.
నెల క్రితం మిర్యాలగూడకు చెందిన సోషల్ వర్కర్ సిక్కిం రాష్ట్రంలోని వృద్ధాశ్రమాన్ని సందర్శించినప్పుడు బుచ్చవ్వ తెలుగులో మాట్లాడటాన్ని గమనించాడు. వివరాలు సేకరించి.. ఎలాగైనా ఆమె ను కుటుంబ సభ్యులకు అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. మంగళవారం సిక్కిం సోషల్ వర్కర్ బినిత్ భూజ.. బుచ్చవ్వను స్వగ్రామానికి తీసుకవచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బుచ్చవ్వ తమ కుటుంబ సభ్యులను చూడగానే సంతోషం వ్యక్తం చేసింది.