వరకట్న వేధింపులు భరించలేని ఓ తల్లి.. భర్తతో నిత్య ఘర్షణలు పడలేని మరో మాతృమూర్తి.. జీవితమే వ్యర్థమనుకున్నారో ఏమో తనువులు చాలించాలనుకున్నారు.. చిన్నారులైన తమ సంతానాన్ని వదిలి వెళ్లలేని ఆ తల్లులు.. పిల్లల ప్రాణాలు తీసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పసికూనలు, ఓ మహిళ మృత్యువాత పడగా, మరో మహిళ ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది.
ముషీరాబాద్/బడంగ్పేట, మే 14: హైదరాబాద్ రాంనగర్ బాకారంలో అదనపు కట్నం వేధింపులతో తన పదినెలల కూతురు సహా ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నది. విజయ వసంతకుమారిని అదనపు కట్నం తేవాలంటూ ఆమె భర్త విద్యాసాగర్, అత్త, ఆడపడుచు తరచూ వేధింపులకు గురి చేయసాగారు. దీంతో ఆమె తన కూతురు విద్యాధరణికి పురుగుల మందు తాగించి, తానూ తాగి విజయ వసంతకుమారి తనువు చాలించింది. హైదరాబాద్ మీర్పేట పరిధిలోని జిల్లెలగూడలో నివాసముంటున్న నేనావత్ శ్రీనివాస్, భారతి దంపతుల మధ్య ఘర్షణ వారి పిల్లల ప్రాణాలను బలిగొన్నది.
శని, ఆదివారాల్లో భార్యాభర్తల నడుమ ఘర్షణ చోటుచేసుకొన్నది. దీంతో భరించలేని భారతి తన కొడుకులైన విక్కి (1.5), 8 నెలల వయసున్న మరో చిన్నారిని వాటర్ టబ్లో ముంచి ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత తానూ విషం తీసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె దవాఖానలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది. మాతృ దినోత్సవం రోజే వెలుగుచూసిన ఈ హృదయవిదారక ఘటనలు స్థానికులను కలచివేశాయి.