కొల్లాపూర్ రూరల్, సెప్టెంబర్ 18: నెల రోజుల కిందట తన ఇద్దరు పిల్లలను కిరాతకంగా చంపిన శాడిస్టు భర్తను గొడ్డలితో నరికి చంపిందో భార్య. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కుడికళ్ల గ్రామంలో ఆదివారం చోటు చేసుకున్నది. కుడికిళ్లకు చెందిన ఓంకార్ (35) మొదటి భార్య చనిపోవడంతో రెండో పెండ్లి చేసుకొని ఆమెకూ విడాకులిచ్చాడు. తర్వాత అదే గ్రామానికి చెందిన మహేశ్వరిని ప్రేమించి మూడో పెండ్లి చేసుకున్నాడు. మద్యానికి బానిసైన ఓంకార్ తరచూ భార్యతో గొడవపడేవాడు. అతడి తీరు నచ్చక గ్రామస్తులు కూడా మాట్లాడేవారు కాదు.
దీంతో కొల్లాపూర్లో అద్దెకు ఉంటూ మేస్త్రీ పనులు చేసేవాడు. గత నెల 17న భార్యాపిల్లలతో కలిసి నాగర్కర్నూల్ దవాఖానలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వెళ్తున్న సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భార్య బైక్ దిగి వెళ్లింది. ఆగ్రహంతో ఓంకార్ అక్కడే ఉన్న తన ఇద్దరు పిల్లలు విశ్వనాథ్ (1), చందన(3)ను ఎత్తంగట్టు వద్దకు తీసుకెళ్లి గొంతుకోసి చంపాడు. తర్వాత తానూ ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. బాటసారుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు చిన్నారుల మృతదేహాలు కనిపించాయి.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓంకార్ను చికిత్సనిమిత్తం పాలమూరు దవాఖానకు తరలించారు. కోలుకున్నాక శుక్రవారం కుడికిళ్లలోని ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే కడుపు కోతతో బాధపడుతున్న భార్యను మరిన్ని వేధింపులకు గురిచేశాడు. దీంతో సహనం కోల్పోయిన మహేశ్వరి శనివారం రాత్రి నిద్రపోతున్న భర్తపై గొడ్డలితో దాడి చేసింది. ఆదివారం కొల్లాపూర్ పోలీసుల ముందు ఆమె లొంగిపోయినట్లు సీఐ యాలాద్రి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.