హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): నాణ్యమైన తేనె ఉత్పత్తికి పాలినేషన్ (పరపరాగ సంపరం) మేలని, తేనెటీగల పెంపకందారులు ఈ పద్ధతిపై దృష్టి పెట్టాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి, పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్), హెచ్ఓఎఫ్ఎఫ్ (హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్) ఆర్ఎం డోబ్రియాల్ అన్నారు. ‘శాస్త్రీయ పద్ధతుల్లో తేనెటీగల పెంపకం’ అంశంపై రాష్ట్రస్థాయి సెమినార్ను ములుగులోని ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ)లో సోమవారం నిర్వహించారు.
నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ (ఎన్బీహెచ్ఎం) ములుగు ఫారెస్ట్ యూనివర్సిటీకి సమీకృత తేనెటీగల పెంపకం, శిక్షణ కేంద్రాన్ని సమకూర్చింది. సుమారు ఐదు కోట్ల ఇరవై లక్షల నిధులను అందజేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రస్థాయి సెమినార్ ఏర్పాటుచేశారు. ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు శిక్షణ ఇచ్చేందుకు ఫారెస్ట్ వర్సిటీ సిద్ధంగా ఉన్నదని డీన్ ప్రియాంక వర్గీస్ తెలిపారు. సెమినార్లో నిపుణులు, తేనెటీగల పెంపకందారులతోపాటు నేషనల్ బీ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్కే పాట్లే, నాబార్డ్ జనరల్ మేనేజర్ హరగోపాల్, పీజేఎస్టీఏయూ తదితరులు పాల్గొన్నారు.