హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): అల్జీమర్స్ (మతిమరుపు) వ్యాధితో తన అమ్మమ్మ పడుతున్న బాధలను స్వయంగా చూశా డు.. ఆమె సంరక్షణకు కుటుంబసభ్యులు పడుతున్న తపన అతడిని తీవ్రంగా కలిచివేసింది. ఎలాగైనా ఈ వ్యాధిగ్రస్థులకు ఊరట కల్పించాలని సంకల్పించి స్మార్ట్ రిస్ట్ బ్యాండ్ను తయారు చేశాడు. హైదరాబా ద్ కూకట్పల్లిలో నివాసముంటున్న చదలవాడ కిశోర్కుమార్ కుమారుడు హేమేశ్. ప్రస్తుతం ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు.
ఆవిష్కరణల పట్ల చిన్ననాటి నుంచే ఆసక్తి ఉన్న హేమేశ్ ఇంట్లో మతిమరుపు వ్యాధితో బాధపడుతున్న అమ్మమ్మ కోసం స్మార్ట్ రిస్ట్ బ్యాండ్ రూపకల్పన చేశాడు. ఈ బ్యాండ్తో రోగి సంచారం, పల్స్, రక్తపోటు (బీపీ)ను పర్యవేక్షించొచ్చు. అనారోగ్యానికి గురైనప్పుడు కుటుంబసభ్యులకు, వైద్యుడికి ఆటోమేటిక్గా హెచ్చరికలు పంపుతున్నది. సంబంధిత యాప్ రోగి ఆరోగ్యస్థితిని తెలియజేయడంతోపాటు వ్యాధిగ్రస్థులు కిందపడిపోతే కెమెరా ఫొటోలు తీసి సంబంధీకులకు పంపుతుంది. సరైన మాత్రలు ఇచ్చారని నిర్ధారించుకోవడానికి స్మార్ట్ పిల్ బాక్స్ ఈ పరికరంలో ఏర్పాటు చేశారు.
హేమేశ్ రూపొందించిన స్మార్ట్ రిస్ట్ బ్యాండ్ ప్రఖ్యాత సామ్సంగ్ కంపెనీ నిర్వహించిన ‘సాల్వ్ ఫర్ టుమారో’లో విజేతగా నిలిచింది. స్టార్టప్ డెవలప్మెంట్ కోసం సదరు కంపెనీ రూ.కోటి గ్రాంట్ మంజూరు చేయడంతోపాటు ఐఐటీ ఢిల్లీలో రిసెర్చ్ చేసేందుకు అవకాశం కల్పించింది. రూ.2 లక్షల విలువైన ల్యాప్టాప్తోపాటు సామ్సంగ్ ఉత్పత్తులను కంపెనీ అందజేసింది.
హేమేశ్ తొలుత ఆర్ట్స్, క్రాప్ట్స్కు సంబంధించి చిన్నప్రాజెక్టులు తయారు చేశాడు. 2, 3వ తరగతులు చదువుతున్నప్పుడే యూట్యూబ్, గూగుల్ సెర్చ్చేసి సొంతంగా ప్రోగ్రాంలపై అవగాహన కల్పించుకొని ఎలక్ట్రానిక్స్ లైట్లు, మోటర్స్తో నడిచే కార్లను తయారు చేశాడు. 8వ తరగతిలో స్మార్ట్ రిచ్ బ్యాండ్ను రూపొందించాడు. 2019లో హైదరాబాద్ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఫెయిర్లో గోల్డ్మెడల్తోపాటు రెండు అంతర్జాతీయ అవార్డులు పొందాడు. ఇన్నోవేషన్లో అత్యుత్తమ ప్రతిభ చూపినందుకు 2021లో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురసార్ అందుకొన్నాడు.