హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జరుగనున్న శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేకంగా స్క్రీనింగ్ కమిటీనీ ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎంసీసీ) అమలు చేసేందుకు వచ్చే ప్రతిపాదనలను పరిశీలించేందుకు ఈ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
కేంద్ర ఎన్నికల సంఘం సూచనలమేరకు ఏర్పాటుచేసిన ఈ కమిటీకి సీఎస్ శాంతికుమారి చైర్మన్గా, ఆయా శాఖల కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతోపాటు జీఏడీ కార్యదర్శి సభ్యులుగా ఉంటారని సీఎస్ తెలిపారు. ఎంసీసీ అమలు ప్రతిపాదనలను ఈ కమిటీ పరిశీలించి ముఖ్య ఎన్నికల అధికారి ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదిస్తుందని మంగళవారం జారీచేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.