కథలాపూర్, ఆగస్టు 14: ఓ అనాథ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సాయంతో ఉన్నత విద్యను అభ్యసించింది. ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. తనలా మరొకరు బాధపడకూడదని భావించిన ఆమె వారికి సాయపడాలన్న ఆలోచనతో ఇటీవల తన జీతం నుంచి సీఎంఆర్ఎఫ్కు రూ.లక్ష విరాళమిచ్చి శభాష్ అనిపించుకున్నది. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్య్రాల గ్రామానికి చెందిన రుద్ర రచన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారింది. చదువులో ఫస్ట్ ఉండే ఈమెకు చదివించే వారే లేకుండా పోయారు. విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లడంతో చదివించేందుకు ముందుకు వచ్చారు. కేటీఆర్ సొంత ఖర్చుతో బీటెక్ పూర్తి చేసింది.
తన ప్రతిభతో గత ఏడాది ఏకంగా నాలుగు సంస్థల్లో ఉద్యోగానికి ఎంపికయ్యారు. విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ఇంటికి పిలిచి అభినందించారు. అదే సమయంలో ఆమె కేటీఆర్కు రాఖీ కట్టడంతో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తనను కలెక్టర్గా చూడాలని తల్లి కోరికని, ఇప్పుడు తల్లి లేకపోయినా ఆమె కోరిక నెరవేర్చేలా సివిల్స్ వైపు దృష్టిపెట్టినట్టు రచన చెప్పగా అందుకు మంత్రి కేటీఆర్ సహకరిస్తానని హామీ ఇచ్చారు. కాగా ప్రస్తుతానికి హైదరాబాద్లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆమె ఇటీవల సీఎం సహాయనిధికి రూ.లక్ష విరాళం చెక్కును అందజేసింది. తనలా అనాథలైన వారికి అండగా ఉండేందుకు.. తన జీతం నుంచి రూ. లక్ష సీఎం సహాయనిధికి చెల్లించినట్టు రచన సోమవారం ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన మంత్రి కేటీఆర్ గ్రేట్ జాబ్ రచన అంటూ అభినందించారు.