సూరత్, జూలై 23: వంద మంది పిల్లలను దత్తత తీసుకొని ఓ పోలీస్ అధికారి గొప్ప మనసు చాటుకొన్నారు. గుజరాత్లోని సౌరాష్ట్రకు చెందిన ఎస్సై హరేశ్బాయ్ ఎల్ జబలియా సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటారు. ఇందులో భాగంగా అమ్రేలీ జిల్లా దాయిదా గ్రామంలోని 100 మంది స్కూల్ పిల్లలను దత్తత తీసుకొన్నారు. వారి చదువుకు అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని ప్రకటించారు. ఆ ఊరిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న 1-8 తరగతుల పిల్లల చదువుకు తన జీతంలోని 10 శాతం కంటే ఎక్కువ వంతును ఖర్చు చేస్తానని పేర్కొన్నారు. అంతేకాదు.. పిల్లల సంరక్షణకు ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారాయన.