Old Admiral Liquor | హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో బాగాపేరున్న ‘ముసలోడి క్వార్టర్’ (ఓల్డ్ అడ్మిరల్ లిక్కర్) ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హల్చల్ చేసింది. తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో ఎక్కడచూసినా అవే మందుసీసాలు దర్శనమిచ్చాయి. ఏపీలో విక్రయిస్తున్న మద్యంపై విముఖత ఉండటంతో ఎన్నికలకు భారీగా తెలంగాణ మద్యాన్ని సరఫరా చేసినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో ఏపీ ఎన్నికల్లో తెలంగాణ మద్యం ఏరులై పారిందని పలువురు అధికారులు చెప్తున్నారు. తెలంగాణకు సరిహద్దులో ఉన్న గోదావరి జిల్లాలు, కృష్ణా, రాయలసీమ జిల్లాలకు తెలంగాణ మద్యాన్ని తరలించినట్టు సమాచారం. అయితే, ఇరు రాష్ర్టాల పోలీసుల పరస్పర ఒప్పందంతో మూడు లోడ్ల లిక్కర్ సరిహద్దులు దాటిందని విశ్వసనీయంగా తెలిసింది.
ఈ తరలింపులో ఏపీకి చెందిన ఎన్నారైలు కీలకంగా వ్యవహరించారని తెలిసింది. తెలంగాణలో మద్యం షాపులను దక్కించుకున్న కొందరు ఎన్నారైలు, వారి బంధుగణంలోని మద్యం షాపుల యజమానులు.. తమ షాపులకు వచ్చే మద్యాన్ని నిల్వ చేసి, అంతా ఒకేసారి లోడ్చేసి పోలీసుల సహకారంతోనే సరిహద్దులు దాటించారని సమాచారం. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ప్రచారం ముగిసిన వెంటనే తెలంగాణలోని ప్రభుత్వ పెద్దల సహకారంతో మద్యం తరలిందని తెలిసింది. కొన్ని జిల్లాకు ముందుగానే మద్యం చేరినట్టు సమాచారం. ఈ మద్యం చేరవేతలో ఏపీలో ప్రతిపక్ష పార్టీకి చెందిన కొందరు ఎన్నారైలు.. తెలంగాణలోని ప్రభుత్వ పెద్దలతో కీలకంగా మంతనాలు జరిపి, మద్యాన్ని ఏపీకి చేర్చారని విశ్వసనీయంగా తెలిసింది. ఏపీలో ఎన్నికల సందర్భంగా చెక్పోస్టుల వద్ద స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం కేసుల్లో తెలంగాణ మద్యం రెండో స్థానంలో ఉన్నది. రాయలసీమ ఓటర్లకు కర్ణాటక నుంచే ఎక్కువగా మద్యం సరఫరా చేయించినట్టు సమాచారం. ఇందుకు తనిఖీల్లో దొరికిన మద్యం లెక్కలే సాక్ష్యం.