టీచర్: గుడ్ మార్నింగ్ డియర్ చిల్డ్రన్ హౌ ఆర్ యూ ?
పిల్లలు: గుడ్ మార్నింగ్, ఫైన్ టీచర్
టీచర్ : పిల్లలూ ఏదైనా కొనడానికి ఏం కావాలి ?
పిల్లలు: డబ్బులు టీచర్
టీచర్: పెన్సిల్ కొనాలంటే ఎన్ని డబ్బులు కావాలి ?
పిల్లలు: 5 రూపాయలు టీచర్
టీచర్ : నాలుగు పెన్సిళ్లు కొనాలంటే ఎంత కావాలి ?
పిల్లలు: 20 రూపాయలు మేడం
టీచర్: ఇరవై రూపాయలని ఎట్ల చెప్పారు ?
పిల్లలు: ఫైవ్ ఫోర్జా 20 కనుక
టీచర్: వెరీగుడ్. టుడే వీఆర్ గోయింగ్ టు లర్న్ ఎబౌట్ మల్టిప్లికేషన్..
పిల్లలు: ఎస్ టీచర్.
ఇది ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్, విద్యార్థుల సంభాషణ. విద్యార్థులను ఉత్సాహపరచడం, తెలిసిన పదాలతో నేర్పించడం, చిన్న చిన్న ట్రిక్కులు చెబుతూ పాఠాలపై ఆసక్తి పెంచేలా బోధన కొనసాగిస్తున్నారు. మూస విధానాలకు స్వస్తి పలుకుతూ నూతన పద్ధతుల్లో పాఠ్యాంశాలు బోధిస్తూ పిల్లలను ప్రైవేటు స్కూ ళ్ల చిన్నారులకు దీటుగా తయారు చేస్తున్నారు. విద్యాశాఖ అమలు చేస్తున్న ‘తొలిమెట్టు’ కార్యక్రమం ద్వా రా పాఠ్యాంశాల బోధన సరికొత్తగా సాగిస్తున్నారు. బోధనాభ్యసన సామగ్రిని వినియోగిస్తూ..లెస్సన్ప్లాన్ (పాఠ్యప్రణాళిక) వినియోగిస్తూ పాఠాలు చెబుతున్నారు. ఫలితంగా విద్యార్థులు లెక్కలు, ఎక్కాలన్న తేడాలు లేకుండా చురుగ్గా అభ్యసిస్తుండటంతోపాటు ఇంగ్లిష్లో అనర్గళంగా చదవగలుగుతున్నారు. తెలుగులో ప్రావీణ్యాన్ని సంపాదించగలుగుతున్నారు.
‘తొలిమెట్టు’ కార్యక్రమంతో పలు ప్రభుత్వ పాఠశాలల్లో క్రమంగా మార్పు కనిపిస్తున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా చదవడం, రాయడం అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తొలుత విద్యార్థులపై ప్రధాన దృష్టి కేంద్రీకరించగా, అసలు టీచర్ల బోధన సరిగ్గా లేదని గుర్తించి బోధనను గాడిలో పెట్టారు. ఎలా బోధిస్తున్నారో పర్యవేక్షణ జరిపి తర్ఫీదు ఇస్తున్నారు. తప్పొప్పులను ఎత్తిచూపకుండా టీచర్లలో మార్పు తెచ్చేందుకు సూచనలు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం గణపురం, సిద్దిపేట మండలం చిన్నగుండవెల్లి, సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లి, బూరుగుపల్లి, వెల్గటూరు, గజ్వేల్ జీపీఎస్, దుబ్బాక బాలికల ప్రాథమిక పాఠశాల, చిన్నకోడూరు మండలం రామునిపట్ల పాఠశాలల్లో విద్యార్థుల స్థాయి బాగా మెరుగుపడినట్టు విద్యాశాఖ బృందాలు తేల్చాయి.
-హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ)
తొలిమెట్టుతో ప్రభుత్వ బడుల్లోని టీచర్ల బోధనాశైలి మారింది. ఉత్సాహంగా, సృజనాత్మక పద్ధతులను అనుసరించి పాఠాలు బోధిస్తున్నారు. మేడ్చల్ జిల్లాలో మూడుచింతలపల్లి స్కూల్లో పరిస్థితి మెరుగయ్యింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన ఇటీవల వెంకటాపూర్ పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల హాజరుశాతం చాలా మెరుగుపడింది.
-విజయకుమారి, మేడ్చల్ డీఈవో
సిద్దిపేట జిల్లాలో బడుల దత్తత కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఉన్నతాధికారులు తలా ఒక స్కూల్ను దత్తత తీసుకొంటున్నారు. అదనపు కలెక్టర్ ఆరు స్కూళ్లను దత్తత తీసుకొని పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలోని 200 పైచిలుకు పాఠశాలలను దత్తత తీసుకోవడంతో పర్యవేక్షణ పటిష్ఠమవుతున్నది.
-భాస్కర్, అకడమిక్
‘తొలిమెట్టు’ ప్రారంభించినప్పటి నుంచి విద్యార్థుల్లో క్రమంగా మార్పు వస్తున్నది. విద్యార్థులు ఉత్సాహంతో బడికొస్తున్నారు. ఇంగ్లిష్ చదివేందుకు ఇబ్బందిపడిన వారు ఇప్పుడు సులువుగా చదివేస్తున్నారు. టీచర్ల బోధనా శైలిలో కూడా మార్పు వచ్చింది.
-హరిత, టీచర్, బూరుగుపల్లి స్కూల్, సిద్దిపేట