మత్స్య సంపదకు హాని తలపెడుతున్న క్యాట్షిష్ ఉనికిని గుర్తించేందుకు హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సరికొత్త విధానాన్ని ఆవిష్కరించింది. నీటి వనరుల్లోని ఇతర జలచరాలకు ముప్పు లేకుండా మట్టిలోని డీఎన్ఏ ఆధారంగా ఈ విధానాన్ని అభివృద్ధి చేసింది. సీనియర్ శాస్త్రవేత్త జీ ఉమాపతి నేతృత్వంలో రూపొందించిన ఈ విధానం ద్వారా క్యాట్ఫిష్ జాడను తక్కువ ఖర్చుతో సులభంగా గుర్తించవచ్చని, మత్స్య రంగానికి ఇది ఎంతో మేలు చేస్తుందని సీసీఎంబీ వర్గాలు చెప్తున్నాయి. ఆఫ్రికా, బంగ్లాదేశ్ తదితర కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన క్యాట్ఫిష్ ఇతర జలచరాలకు ఎంతో హాని తలపెడుతుంది.
ఈ చేపల్లో ఉండే ఒమేగా ఫ్యాటీ 6 ఆమ్లాలు నరాలను దెబ్బతీయడంతోపాటు క్యాన్సర్ను కలిగిస్తాయని పలు పరిశోధనల్లోనూ తేలింది. దీంతో దేశవ్యాప్తంగా క్యాట్ఫిష్ను నిషేధించారు. అయినా కొందరు గుట్టుగా వీటిని పెంచుతున్నారు. కొర్రమీనును పోలినట్టు ఉండే క్యాట్ఫిష్ను కొర్రమీను కంటే తక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు స్థానిక జల సంపదను ధ్వంసం చేసేందుకు క్యాట్ఫిష్ను ఉపయోగిస్తున్నారు.