హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీలో అత్యాధునిక వసతులతో నూతన హాస్టల్ (బాయ్స్) నిర్మించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. 2.76 ఎకరాల్లో రూ.39.50 కోట్ల అంచనా వ్యయంతో, 1,06,292 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబోయే హాస్టల్ పనులకు శనివారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. 3 అంతస్థుల్లో 500 మంది విద్యార్థులకు వసతి కల్పించే ఈ హాస్టల్ను ఏడాదిలోపు అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం ఓయూలో 24 హాస్టళ్లు ఉండగా, ఇందులో బాయ్స్ (12), ఉమెన్స్ (12). వర్సిటీలో 70శాతానికి పైగా అమ్మాయిలే ఉండటంతో బాలుర హాస్టల్ను గతేడాది అమ్మాయిలకు కేటాయించారు. అబ్బాయిలు ఉండేందుకు హాస్టళ్లు లేకపోవడంతో నూతన హాస్టల్ నిర్మాణానికి టీఎస్ఈడబ్ల్యూఐడీసీ అధికారులు టెండర్లు పూర్తిచేశారు.