హైదరాబాద్ నగరంలో దెబ్బతిన్న రోడ్డును బాగు చేయాలంటూ ఫిరోజ్ అనే వాహనదారుడు ఇలా సోమవారం గుంతలపై పడుకొని నిరసన తెలిపారు. ఇమ్లిబన్ – పుత్లిబౌలి రోడ్డు అధ్వాన స్థితిలో ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు.
నెలరోజులుగా తమకు పురుగుల అన్నమే పెడుతున్నారని ఆరోపిస్తూ సంగారెడ్డి జిల్లా బుధేరా మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కనీస నాణ్యత పాటించడం లేదని, ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. హాస్టల్లో డాక్టర్ లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించేవారే కరువయ్యారని వాపోయారు.
యూరియా కొరత, సర్కార్ వైఫల్యంపై రైతులు రోడ్డెక్కారు. సోమవారం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి, ఆలూరు మండల కేంద్రాల్లో సొసైటీల వద్ద బైఠాయించారు. కేసీఆర్ హయాంలో ఇలాంటి యాతన ఎప్పుడూ ఎదుర్కోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తున్నదని, అయినా బస్తా కూడా దొరుకడం లేదని వాపోయారు.
పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఒంటరి మహిళకు షాక్ ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్. ఆమె గతంలోనే చనిపోయినట్టు ఆన్లైన్లో పేర్కొన్నది. దీంతో మంచిర్యాల జిల్లా నాగంపేటకు చెందిన లాపాక శంకరమ్మ సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తాను బతికే ఉన్నానని, గుర్తించాలని కోటపల్లి ఎంపీడీవోను వేడుకున్నారు.