రాంనగర్, జనవరి 4: ప్రేమను నిరాకరించిందని ఓ యువతిపై ఉన్మాది కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన ఆడెపు వీరేశం – రేణుక దంపతుల కూతురు కావ్యశ్రీ ఎమ్మెస్సీ చదువుతున్నది. ఆమె ఇంటి సమీపంలో ఉండే బొద్దుల సాయి కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. గతంలో ఓసారి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. తర్వాత ఆ యువకుడు కొత్తపల్లి నుంచి మంథని వెళ్లిపోయాడు. మూడు రోజుల క్రితమే కొత్తపల్లికి వచ్చాడు.
ఈ క్రమంలో కావ్య ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించి సాయి ఇంట్లోకి చొరబడ్డాడు. తనను ప్రేమించాలని బలవంతం చేశాడు. ఆమె ఒప్పుకోకవడంతో అక్కడే ఉన్న కత్తితో కావ్యశ్రీ గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. ఆమె చేతులు అడ్డం పెట్టడంతో మెడకు చేతులకు గాయాలయ్యాయి. కావ్య గట్టిగా కేకలు వేయడంతో సాయి అకడి నుంచి పరారయ్యాడు. కుటుంబ సభ్యులు కావ్యశ్రీని కరీంనగర్లోని దవాఖానకు తరలించారు. రూరల్ ఏసీపీ కర్ణాకర్ రావు, సీఐ ప్రదీప్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దవాఖానకు వెళ్లి ఆమె వాంగ్మూలం తీసుకొని, నిందితుడు సాయిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీపీ తెలిపారు.