గూడూరు, జూన్ 6: ఓ కుక్క తరుచూ కరుస్తున్నదని, దాని యజమానిపై చర్యలు తీసుకోవాలంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. వినడానికి విచిత్రంగా ఉన్న ఈ ఘటన సోమవారం మహబూబాబాద్ జిల్లాలో జరిగింది.
గూడూరు మండలం బ్రాహ్మణపల్లి పరిధి హాముతండాకు చెందిన ధరావత్ పూల్సింగ్ గూడూరులోని వ్యవసాయ కార్యాలయం వద్ద నుంచి సోమవారం ఉదయం 6 గంటలకు పని కోసం నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో అక్కడున్న ఓ కుక్క తన మీదికి వచ్చిందని, తనను చూడగానే కరుస్తున్నదని వాపోయాడు. ఇప్పటికి మూడుసార్లు కరిచిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కుక్కను కట్టేయాలని దాని యజమానికి చెబితే తననే దూషించాడని తెలిపాడు. కుక్క యజమానిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పడంతో పూల్సింగ్ వెళ్లిపోయాడు.