వనపర్తి : ఓ ఇల్లాలి మనసు పరాయి మగాడిపై పడింది.. ఇంకేముంది.. కట్టుకున్న భర్తను గాలికి వదిలేసి.. ప్రియుడితో సరసాలాడటం మొదలెట్టింది. పొలం అమ్మగా వచ్చిన డబ్బుతో మరింత రాజసంగా ప్రియుడితో రాసలీలల్లో మునిగిపోవాలనుకుంది. అనుకున్నదే తడువుగా భర్తను చంపాలని నిర్ణయించుకుంది. అర్ధరాత్రి కోడిపుంజులను బలిస్తే మంచి జరుగుతుందని భర్తను నమ్మించి అతన్నే బలి తీసుకున్నది. వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన దాదాపు ఐదు నెలల తర్వాత వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి మండలం చిమనగుంటపల్లికి చెందిన బాలస్వామికి, లావణ్య(కాగజ్నగర్)తో పదేండ్ల క్రితం వివాహమైంది. బాలస్వామి వృత్తిరీత్యా మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఈ దంపతులిద్దరూ తమ పిల్లలతో వనపర్తిలోని గాంధీనగర్లో నివాసం ఉంటున్నారు.
అయితే మదనపూర్కు చెందిన నవీన్ అనే యువకుడు అప్పుడప్పుడు గాంధీనగర్కు వస్తుండేవాడు. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన నవీన్.. గాంధీనగర్లోని తన స్నేహితులతో కలిసి ఉండేవాడు. ఈ క్రమంలో లావణ్యకు నవీన్తో పరిచయం ఏర్పడింది. ఇక లావణ్య, నవీన్కు మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ కలిసి పలుమార్లు ఎంజాయ్ చేశారు.
అయితే బాలస్వామి 5 నెలల క్రితం తనకున్న పొలాన్ని అమ్మేశాడు. దీంతో రూ. 30 లక్షలు వచ్చాయి. ఆ డబ్బును చూసిన లావణ్య ఎన్నో కలలుగన్నది. ఆ పైసలన్నీ తీసుకొని ప్రియుడితో బయటకు వెళ్లిపోయి.. మరింత ఎంజాయ్ చేయాలనుకుంది. కానీ భర్తను అంతమొందిస్తేనే ఈ సరసాలు సాధ్యమవుతాయని లావణ్య నిర్ణయించుకుంది. భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని ఆమె కుట్ర చేసింది.
భర్తను హత్య చేసే కుట్రలో భాగంగా లావణ్య కోడిపుంజుల నాటకం ఆడింది. మనకు మరింత మంచి జరగాలంటే.. వనపర్తి జిల్లా కేంద్రం శివారులోని జెర్రిపోతుల మైసమ్మ వద్ద అర్ధరాత్రి కోడి పుంజులను బలివ్వాలని భర్తను నమ్మబలికింది లావణ్య. భర్త కూడా భార్య మాటలను నమ్మాడు. దీంతో ఈ ఏడాది జనవరి 21న అర్ధరాత్రి తన బైక్పై ఒక్కడే కోడిపుంజులను తీసుకొని మైసమ్మ ఆలయం వద్దకు వెళ్లాడు. అర్ధరాత్రి బయటకు వెళ్లిన బాలస్వామి ఇంటికి తిరిగి రాలేదు.
అయితే అర్ధరాత్రి సమయంలో మైసమ్మ ఆలయం వద్దకు వెళ్లిన బాలస్వామిని నవీన్, సుపారీ గ్యాంగ్ కురుమూర్తి, బంగారయ్య, గణేశ్లు కలిసి కిడ్నాప్ చేశారు. బలవంతంగా కారులో ఎక్కించి, నోట్లో గుడ్డలు కుక్కారు. కొత్తకోట మీదుగా హైదరాబాద్ పరిసరాల్లోని బాలాపూర్ ప్రాంతానికి తీసుకొచ్చి హత్య చేశారు. అక్కడే శవాన్ని పూడ్చిపెట్టారు.
అయితే అర్ధరాత్రి బయటకు వెళ్లిన బాలస్వామి ఇంటికి తిరిగి రాలేదు. లావణ్య కూడా ఇంట్లో కనిపించలేదు. అనుమానం వచ్చిన బాలస్వామి తమ్ముడు కొమ్మరాజు జనవరి 22న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొత్తంగా ఇటీవలే లావణ్య, నవీన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. బాలస్వామిని హత్య చేసేందుకు పాన్గల్కు చెందిన కురుమూర్తి, బంగారయ్య, గణేష్లతో రూ. 2 లక్షల సుపారీ మాట్లాడుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మృతదేహాన్ని వెలికి తీసేందుకు నిందితులను వనపర్తి పోలీసులు ఇవాళ బాలాపూర్కు తీసుకెళ్లారు.