కోదాడ రూరల్, ఆగస్టు 26: సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధి దోరకుంట శివారులోని హైదరాబాద్- విజయవాడ 65వ నంబర్ ప్రధాన జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందగా, 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరం మియాపూర్ నుంచి రాత్రి 11 గంటలకు 38 మంది ప్రయాణికులతో ఓ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సు ఏలూరుకు బయలుదేరింది.

మార్గమధ్యంలో నలుగురు ప్రయాణికులను ఎక్కించుకున్నది. సూర్యాపేట శివారులోని దురాజ్పల్లి వద్ద బస్సు చార్జింగ్ పెట్టుకుని డ్రైవర్లు డ్యూటీ మారారు. కోదాడ మండల పరిధి దోరకుంట శివారులోని 65వ జాతీయ రహదారిపై అప్పటికే రోడ్డు ప్రమాదానికి గురైన ఐరన్ స్తంభాల కంటైనర్ ట్రాలీని వెనుక నుంచి బస్సు ఢీకొన్నది. దీంతో స్తంభాలు బస్సులోకి దూసుకువచ్చి నిద్రిస్తున్న ప్రయాణికులపై పడటంతో ఐదుగురు యువతులు, ఒక యువకుడు మృతి చెందగా, 12 మందికి తీవ్రగాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుల్లో ఎన్టీఆర్ జిల్లా తాలబ్రోలుకు చెందిన చిన్ని (32), పడమరలంకపల్లికి చెందిన నాగేంద్రబాబు (31), సురవరపు షఖీనా (24), విజయవాడకు చెందిన జ్యోత్స్న(29), భావనవర్ష (25), లక్ష్మీతేజ (25) ఉన్నారు. వీరిలో ఐదుగురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కాగా.. చిన్ని హౌస్వైఫ్. కలెక్టర్ తేజస్ నందలాల్పవార్, ఎస్పీ నరసింహ, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఘటనాస్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య దవాఖానలో బాధితులను పరామర్శించి, మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి: కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కంటైనర్ను ఢీకొన్న ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందడం అత్యంత విషాదకరమని పేరొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరారు. క్షతగాత్రులకు సత్వర వైద్యసేవలు అందించడంతోపాటు, మృతుల కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం అందజేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
