రాజాపూర్, డిసెంబర్ 3: మానవ మృగాల చేతిలో ఓ బాలిక బలైంది. బాలిక సమీప బంధువే తన స్నేహితులతో కలిసి బాధితురాలిపై దారుణానికి ఒడిగట్టడం, ఆపై హతమార్చిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో కలక లం రేపింది. స్థానికుల కథనం మేరకు.. బాలానగర్ మండలం తిర్మలగిరి పంచాయతీ పరిధిలోని ఓ తండాకు చెందిన వ్యక్తి భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్లో శుభకార్యానికి వెళ్లాడు. పదో తరగతి చదువుతున్న అతడి కూతురు (16) ఇంటి వద్దే ఉండి బడికి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన గ్రామానికి చెందిన ఇద్దరు, పక్క గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి శుక్రవారం రాత్రి బాధితురాలి ఇంట్లోకి చొరబడి సామూహిక లైంగికదాడికి పాల్పడి, హత్య చేసినట్టు తెలిసింది.
ఆ తర్వా త హైదరాబాద్కు పరారయ్యేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నట్టు సమాచారం. తెల్లవారుజామున గమనించిన స్థానికులు.. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులకు విషయాన్ని తెలిపారు. లైంగికదాడి, హత్య ఘటనతో రెండు గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొన్నది. బాధితురాలి బంధువులు.. అనుమానితుల ఇండ్లను, చిన్నరేవల్లిలో టీవీ రిపేర్ షాపును ధ్వంసంచేశారు. అనుమానితుడికి చెందిన కారును దహనం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. సీఐ జములప్ప, బాలానగర్ ఎస్సై జయప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు.
నిందితులకు శిక్ష పడేలా చూస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. అనంతరం బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల దవాఖానకు తరలించారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దవాఖానకు వెళ్లి బాలిక కుటుంబీకులను ఓదార్చారు. కాగా, సాయంత్రం బాలిక మృతదేహంతో జడ్చర్లలో బంధువులు మరోసారి రోడ్డుపై బైఠాయించారు. మూడు గంటలపాటు రాస్తారోకో చేశారు. ఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీవో అనిల్కుమార్ అక్కడికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. 5 లక్షల ఎక్స్గ్రేషియా, డబుల్బెడ్రూం, బాధిత కుటుంబం లో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు.
హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మహబూబ్నగర్ జిల్లా లైంగికదాడి ఘటనలపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని శనివారం అధికారులను ఆదేశించారు. ఉన్నత చదువుల కోసం థాయిలాండ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన విద్యార్థినిపై హెచ్సీయూ ప్రొఫెసర్ లైంగికదాడి యత్నానికి పాల్పడిన ఘటన, పాలమూరు జిల్లా బాలానగర్ మండలంలో పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, హత్య ఘటనలను కమిషన్ సుమోటోగా స్వీకరించిందని తెలిపారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులు కొంతమంది తప్పుదోవ పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూ రులో బాబాయ్ వరసయ్యే వ్యక్తులే అఘాయిత్యానికి పాల్పడటం విచారకరమన్నారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం, మహిళా కమిషన్ అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. నిందితులకు కఠినశిక్ష పడేవిధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.