జయశంకర్ భూపాలపల్లి , మే1 : 50 ఆకుల తునికాకు కట్టకు రూ.3 చెల్లించాలని డిమాండ్తో భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు పేరుతో వెలసిన కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. మహాముత్తారం మండలంలోని కనుకునూర్, పెగడపల్లి, రెడ్డిపల్లి గ్రామాల్లో గ్రామస్తులు ఈ కర పత్రాలను గుర్తించారు.
ఎన్నో ఏండ్ల నుంచి వేసవి కాలం వచ్చిందంటే గిరిజనులు, సామన్య ప్రజలు తునికాకును నమ్ముకొని బతుకుతున్నారని, కాని ఇప్పటి వరకు కట్టకు రెండు రూపాయలు మాత్రం దాటలేదని, కొన్ని ప్రాంతాల్లో రూ.1.50 మాత్రమే చెల్లిస్తున్నారని ఆ కరపత్రంలో పేర్కొన్నారు.
అదే విధంగా మోడెం కూలికి రోజుకి రూ. 500 చెల్లించాలని, కల్లెదార్ వేతనాలు పెంచాలని, ప్రమాదంలో చనిపోయిన వ్యక్తికి రూ. 5 లక్షలు, గాయపడిన వ్యక్తికి రూ. రెండు లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ కనీస ధర కూడా ఇవ్వడం లేదని, అతడు కిలో మూడు వందలకు అమ్ముకోని కోట్లను గడిస్తున్నాడని అందులో పేర్కొన్నారు.