హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : తన కూతురు విమానం నడిపే పైలట్ ఉద్యోగం సాధించిందని ఓ తండ్రి ఆనందానికి అవధుల్లేకుండాపోయింది. ఏకంగా తన కిరాణా దుకాణంలో పనిచేసే సిబ్బందిని విమానం ఎక్కించి తిరుమల తీసుకెళ్లి శ్రీవారి దర్శనం చేయించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలకేంద్రంలో అజీజ్ హీరాణి కిరాణా దుకాణం నడిపిస్తున్నారు. అతని కూతురు అఫీనా హీరాణిని ఉన్నత చదువులు చదివించారు. ఆమె పైలట్ శిక్షణ పొంది, ఇండిగో విమాన సర్వీసులో ఉద్యోగం సాధించింది.
కూతురు పైలట్ కావడంతో తన కిరాణాషాపులో పనిచేసే 15 మంది సిబ్బందిని వారి కోరిక మేరకు విమానం ఎక్కించి తిరుపతి శ్రీవారి దర్శనానికి పంపారు. తన కూతురు విజయానికి కూలీల శ్రమ కూడా ఉన్నదని అజీజ్ పేర్కొన్నారు. స్వామి దర్శనంతో పాటు వారిని హైదరాబాద్లోని వండర్ వరల్డ్తో పాటు పలు ప్రాంతాలకు తీసుకెళ్లినట్టు చెప్పారు. “మా జీవితంలో విమానాన్ని దగ్గరగా కూడా చూడలేదు. విమానంలో వెళ్లి శ్రీవారిని దర్శించుకొనే భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉన్నది” అని సిబ్బంది ఏత్మారావు, అశోక్, లక్ష్మణ్, ఇందల్, జోర్సింగ్ తెలిపారు. ఈ విషయం తెలిసిన పలువురు అజీజ్ను అభినందించారు.