హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): ఒకవైపు సుభిక్షమైన పంటలతో, నిత్యం పారే ఏరులతో, మహా జలరాశుల రిజర్వాయర్లతో తెలంగాణ కళకళలాడుతుంటే.. తామేదో ఉద్ధరిస్తామన్నట్టు వరంగల్లో కాంగ్రెస్ సభ నిర్వహించడం, రైతులను ఆదుకొనేందుకంటూ డిక్లరేషన్ను ప్రకటించడంపై నలుగురూ నవ్వి పోతున్నారు.
అద్భుతమైన ఆర్థిక వ్యవస్థగా ఉన్న తెలంగాణను ఉమ్మడి ఏపీలో కలిపినది మొదలు.. తర్వాత దాదాపు 47 ఏండ్ల పాలనలో తెలంగాణ జవసత్వాలను పీల్చి పిప్పి చేసేంత వరకు జరిగిన పాపాలన్నింటికీ కాంగ్రెస్ బాధ్యత వహించాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వాటిని మర్చిపోయి.. ఇప్పుడేదో తెలంగాణకు కష్టం వచ్చినట్టు, తాము అధికారంలోకి వచ్చి ఆదుకుంటామన్నట్టు కాంగ్రెస్ నేత రాహుల్ ప్రకటించడాన్ని ఎద్దేవా చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయరంగం ధ్వంసం కావడానికి, అన్నదాతల బతుకులు ఆగమై, వేలమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ పాలనా వైఫల్యాలే.
దశాబ్దాలు అధికారంలో ఉన్నా, తెలంగాణ రైతులకు సాగునీరు అందించకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించారన్నది చరిత్ర తెలిపే సత్యం. అలాంటి కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తెలంగాణ అన్నదాతలపై ఒక్కసారిగా ప్రేమ ఒలకబోస్తున్నారని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. వరంగల్లో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో అన్నదాతల కోసం కాంగ్రెస్ ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో ఈ హామీలను అమలు చేస్తున్నారా? అని రాహుల్గాంధీని తెలంగాణ రైతులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ఆ పార్టీ ప్రస్తుతం పాలిస్తున్న రాష్ర్టాల్లో అమలవుతున్నాయో, లేదో చూద్దాం?
అనేక కష్ట నష్టాలకు ఓర్చి కాంగ్రెస్ తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చింది. అసలు నిజం: దేశానికి మనం స్వాతంత్య్రం తెచ్చుకున్నామా? బ్రిటిష్వాడు ఇచ్చాడా? తెలంగాణ కూడా అంతే. కాంగ్రెస్ ఇవ్వలేదు. మనం తెచ్చుకున్నాం. మన తెలంగాణను 1956లో ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్. అది తెలంగాణకు తొలి విలన్. అందుకే రెండు ఎన్నికల్లో ప్రజలు కర్రుగాల్చి వాతపెట్టారు!
తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అసలు నిజం: నేషనల్ క్రైమ్బ్యూరో ప్రకారం 1995 నుంచి తెలంగాణలో 27 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2004 నుంచి 2014 వరకు 16,963 మంది రైతులు ప్రాణాలు బలిపెట్టారు. ఏపీలోనూ, మహారాష్ట్రలోనూ ఎక్కువ కాలం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే. ఆ నాడు రైతు ఆత్మహత్యల్లో విదర్భది మొదటి స్థానమైతే, తెలంగాణది 2వ స్థానం. రైతు ఆత్మహత్యలపై రాహుల్ మాట్లాడటమంటే దయ్యాలు వేదాలు వల్లించడమే!
రైతులకు మేలు చేయడం కోసమే వరంగల్ డిక్లరేషన్ ప్రకటిస్తున్నాం.అసలు నిజం: డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రకటించిన హామీలను, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో అమలు చేస్తున్నారా? ఎందుకు చేయడం లేదు? అక్కడ రైతులు లేరా? ఉమ్మడి ఏపీలో సుమారు 50 ఏండ్లు అధికారంలో ఉన్న మీరు ఈ హామీలను ఎందుకు అమలు చేయలేదు. ఒకవేళ మీది అంత రైతు ప్రభుత్వమే అయితే, వ్యవసాయ ప్రధానమైన, రైతు శక్తి బలంగా ఉన్న పంజాబ్.. ఐదేండ్లయినా కాకముందే మిమ్మల్నెందుకు ఈడ్చి తన్ని పారేసింది.?
బీజేపీతో టీఆర్ఎస్ అవగాహనలో ఉంది.అసలు నిజం: వడ్లు మొదలుకుని మతతత్వం దాకా బీజేపీతో పోరాడుతున్నది ఎవరో దేశమంతా చూస్తున్నది. తెలంగాణ పోరాడుతుంటే బీజేపీకి మద్దతుగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నదెవరో కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లను అర్రలోకి తీసుకుపోయి అడిగితే రాహుల్కు అసలు సంగతి తెలిసేది.
వరంగల్ సభ మొదటి నుంచి చివరిదాకా ఎదురుచూస్తే, ఒక్కరన్నా, ఒక్కసారన్నా జై తెలంగాణ అన్లేదు. రాహుల్ గాంధీ ప్రసంగం ముగిస్తూ నమస్కార్.. జై హింద్ అన్నారే తప్ప, జై తెలంగాణ అనటానికి కూడా నోరు రాలేదు.. వీళ్లు తెలంగాణను ఉద్ధరిస్తారట! వీళ్లా తెలంగాణను బాగు చేసేది!!
మీ ముత్తాత, మీ నాయనమ్మ.. మీ నాయనమ్మ చనిపోగానే మీ తండ్రి, తరువాత మీ అమ్మ.. ఇప్పుడు మీరు… మీ చెల్లె… 75 ఏండ్ల స్వతంత్ర భారత్లో 4 తరాల లబ్ధిదారులు మీరు.. మీ కుటుంబం! స్వాతంత్య్రం వచ్చే నాటికి కనీసం పుట్టనైనా పుట్టని మీరు ప్రధాని పదవికి డైరెక్ట్ వారసులు కావచ్చు. కానీ, పది పన్నెండేండ్ల పాటు ఉద్యమంలో పోరాడిన కుటుంబం మాత్రం మీకు మరోలా కనిపించడం విచిత్రం.. గురివింద రాహుల్ జీ..
2004 నుంచి 2014 దాకా పదేండ్ల పాటు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్సే అధికారంలో ఉంది. ఆ పదేండ్లలో తెలంగాణలో జరిగిన రైతు ఆత్మహత్యల సంఖ్య ఇది (నేషనల్ క్రైమ్బ్యూరో రికార్డుల ప్రకారం)
ఇదంతా రైతులపై ప్రేమ కాదు.ఏడాదిన్నరలో వచ్చే ఎన్నికలపై ప్రేమ. వరంగల్లో జరిగింది రైతు సంఘర్షణ సభ కాదు,రాహుల్ సంఘర్షణ సభ. పదవుల సంఘర్షణ సభ. అధికార సంఘర్షణ సభ. తెలంగాణను ముంచేందుకు పన్నిన నయవంచన సభ!
1.ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ.
2. ‘ఇందిరమ్మ రైతు భరోసా’ కింద రైతులు, కౌలు రైతులకు ఎకరాకు ఏటా రూ.15 వేల పెట్టుబడి సాయం
అమలుకావడం లేదు.
3. అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు.
4. మూతబడిన చకెర కర్మాగారాలను తెరిపిస్తాం, పసుపు బోర్డు ఏర్పాటుచేస్తామన్నారు.
5. ఉపాధి హామీలో నమోదు చేసుకొన్న కూలీలకు ఏటా రూ.12 వేలు ఇస్తామన్నారు.
6. మెరుగైన పంటల బీమా పథకం తెస్తామన్నారు. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకం అనుసంధానం చేస్తామన్నారు.
7. పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్న రైతులకు యాజమాన్య హకులిస్తామన్నారు.
8. నకిలీ విత్తనాలు, పురుగు మందుల నియంత్రణకు కఠిన చట్టం తెచ్చి, కారకుల ఆస్తులు జప్తు చేస్తామన్నారు.
9. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా చేస్తామన్నారు.
10. రైతు కమిషన్ ఏర్పాటు, నూతన వ్యవసాయ విధానం, పంటల ప్రణాళిక తెస్తామన్నారు.