హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): వర్షకాలం సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వరదల నియంత్రణ, విపత్తు నిర్వహణకు తీసుకోవాల్సిన ముందస్తు నివారణ చర్యలపై కసరత్తు ముమ్మరం చేశారు. యాక్షన్ప్లాన్ను ఇప్పటికే సిద్ధం చేసి, రాష్ట్రస్థాయిలో ఎర్రమంజిల్ జలసౌధలో సెంట్రల్ ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
అదేవిధంగా అన్ని ఇరిగేషన్ సర్కిళ్లలో కూడా కంట్రోల్ రూములను ఏర్పాటు చేయడంతోపాటు, జూన్ 16 నుంచి డిసెంబర్ 15 వరకు 24 గంటల పాటు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ మేరకు సూపరింటెండెంట్ ఇంజినీర్లకు ఈఎన్సీ మురళీధర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరదలను సమర్థంగా నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ముందస్తు జాగ్రత్తలపై మార్గదర్శకాలను జారీ చేశారు. కంట్రోల్ రూములలో అందుబాటులో ఉండే అధికారుల వివరాలను 31వ తేదీలోగా పంపించాలని ఆదేశించారు.
నదుల్లో నీటి ప్రవాహాల వివరాలను, తుఫాను హెచ్చరికలు తదితర సమాచారాన్ని రోజువారీగా ఉదయం 8 గంటల్లోగా అందజేయాలని నిర్దేశించారు. రివర్ బేసిన్లలో నష్టం వాటిల్లితే వెంటనే సంబంధిత కలెక్టర్లకు సమాచారాన్ని చేరవేయాలని వివరించారు. పంట కాలువలకు నీటిని అందించే హెడ్ రెగ్యులేటరీలను మూసివేయాలని సూచించారు. ఫ్లడ్ బ్యాంక్స్, ఇరిగేషన్ పనులను, ఆనకట్టలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, వాటి వివరాలను నిర్దేశిత ప్రొఫార్మాలో అందజేయాలని, ఆయా చోట్ల వరద నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. గండ్లు పడే ప్రమాదమున్న కట్టలను గుర్తించాలని, వాటిని వెంటనే పూడ్చేందుకు వీలుగా ఇసుక బస్తాలు, కంకరను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.