మల్కాజిగిరి, నవంబర్ 14 : మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతోపాటు ఆయన భార్య వాణి, కూమారుడు రోహిత్రావుపై లోకాయుక్తలో కేసు నమోదైంది. ఆయన అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడ్డాడని అడ్వకేట్ రామారావు ఇమ్మానేని గత నెల 31న ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది.
ఎమ్మెల్యే మైనంపల్లి కోట్ల రూపాయల అవినీతి సొమ్ము కూడబెట్టారని, గత ఎన్నికల అఫిడవిట్లో ఆయన తన ఆస్తి విలువను కేవలం రూ.3 కోట్లుగా, మైనంపల్లి వాణి ఆస్తి విలువను రూ.50 లక్షలుగా చూపారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కానీ, వారి వద్ద సుమారు రూ.20 కోట్ల విలువైన పద్దెనిమిది విదేశీ కార్లతోపాటు సొంత విమానాలు, రూ.కోట్ల విలువైన అరేబియా గుర్రాలు, విదేశీ పెంపుడు కుక్కలు, విలాసవంతమైన పలు వస్తువులు ఉన్నాయని తెలిపారు. వీటిపై వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. దీంతో మంగళవారం లోకాయుక్తలో ఈ ఫిర్యాదును పరిశీలించిన జడ్డి.. మైనంపల్లితోపాటు ఆయన భార్య, కుమారుడిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు.