దేశవ్యాప్తంగా ప్రతి వంద మందిలో 70 మంది, బంగాళాఖాతం పరివాహాక ప్రాంతాల్లో నివసించే 90 శాతం మంది మాంసాహారులే. లక్షద్వీప్లో 100 శాతం మాంసాహారులు. తర్వాత స్థానాల్లో ఈశాన్య రాష్ర్టాల్లో (99 శాతం), కేరళ 98 శాతం, పుదుచ్చేరి 97 శాతం, తమిళనాడు 96.4, ఏపీ, తెలంగాణలో 96 శాతం, అత్యల్పంగా రాజస్థాన్లో 32.4 శాతం మంది మాంసాహారులు ఉన్నారు.
Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కార్యం ఏదైనా ముక్క, మందు ఉండాల్సిందే. సందర్భం ఎలాంటిదైనా మెనూలో మటన్ లేదా చికెన్ పెట్టాల్సిందే. అధిక శాతం మందికి ముక్క లేనిదే ముద్ద దిగడం లేదు. ఎందుకంటే రాష్ట్ర జనాభాలో 96 శాతం మంది మాంసాహారులే. స్టాట్స్ ఆఫ్ ఇండియా రూపొందించిన తాజా నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ప్రతి వంద మందిలో 70 మంది మాంసాహారులే ఉండగా… తెలుగు రాష్ర్టాల్లో నలుగురు మాత్రమే శాఖాహారులు ఉన్నారు. మిగిలిన 96 మంది మాంసం తినేందుకు ఇష్టపడుతున్నారని వెల్లడైంది. దేశంలోని అన్ని రాష్ర్టాల్లో మాంసం కొనుగోళ్లు, మాంసహారాలు, ఆహారపు అలవాట్లు, శాఖాహారం వినియోగం ఏ విధంగా ఉందనే విషయాన్ని తెలుసుకున్నారు. ఇందులో 18-49 ఏండ్లలోపు ఉన్న స్త్రీ, పురుషులతో కలిసి సర్వే చేయగా… తెలుగు రాష్ర్టాల్లో 96 శాతం మంది మాంసాహారులే ఉన్నారని స్పష్టమైంది. తెలంగాణలో గతేడాది కంటే మాంసాహారుల సంఖ్య ఐదు శాతం పెరిగినట్లుగా వెల్లడైంది. జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వేను ప్రామాణికంగా తీసుకొని ఈ అధ్యయనం చేసినట్లుగా స్టాట్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం రెండు తెలుగు రాష్ర్టాల్లో మాంసం తినేవారే ఎక్కువగా ఉండగా.. జాతీయ సగటు కంటే 20 శాతం అధికంగా ఉన్నట్టు తేలింది.
దేశంలో ఏటా మాంసం వినియోగం పెరుగుతున్నది. 2015-16లో 74 శాతం మంది మాంసాహారులు ఉండగా.. 2019-21 నాటికి ఏకంగా నాలుగు శాతం పెరిగారు. ఈ లెక్కన గడిచిన మూడేండ్లలో మాంసాహారుల సంఖ్య 5-8 శాతం మేర పెరిగి ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సగటున 77 శాతం మంది చికెన్, మటన్, ఫిష్, ఇతర మాంసాహారాలను తింటున్నారని లెక్క తేలిం ది. ఇక తెలుగు రాష్ర్టాల్లో ఈ సంఖ్య 96 శాతం మంది ఉండగా.. వారం నుంచి 15 రోజుల వ్యవధిలో ఒక్కసారైనా తునకలు ఇంట్లో ఉడికిస్తున్నారని తెలిసింది. పురుషులతో పోల్చితే మాంసం తినే మహిళల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నది. వారానికి ఒకసారి కూడా తినని మహిళలు 39 శాతం మేర ఉన్నట్టు తేలింది. అదే పురుషుల్లోనైతే వారానికొసారైన తినేవారు 49 శాతం మంది ఉండగా, మెజార్టీగా సందర్భానుసారంగా ముక్కల భోజనం ఉండేలా చూసుకుంటున్నారు.
మెట్పల్లి రూరల్, మార్చి 20: వివాహ విందులో మటన్ అడిగినంత వేయలేదనే కారణంగా జరిగిన గొడవలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూర్లో చోటుచేసుకున్నది. మెట్పల్లి ఎస్సై చిరంజీవి కథనం ప్రకారం.. మెట్పల్లి మండలం ఆత్మకూర్కు చెందిన అమ్మాయికి, వేములవాడకు చెందిన అబ్బాయికి బుధవారం ఆత్మకూర్లో వివాహం జరిగింది. ఈ వివాహ విందులో మటన్ సరిగ్గా వడ్డించలేదంటూ అబ్బాయి తరఫు బంధువులు ఆరోపించారు. ఈ విషయమై అబ్బాయి, అమ్మాయి తరఫు బంధువుల మధ్య ఏర్పడిన గొడవ పరస్పర దాడుల వరకు వెళ్లింది. ఈ దాడిలో ఇరు వర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు. ఇరు వర్గాల వారు పరస్పరం ఫిర్యాదు చేయగా పోలీసులు కేసులు నమోదు చేశారు.