హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : మంగళవారం నిర్వహించిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల్లో కెమిస్ట్రీ ప్రశ్నలు మధ్యస్తంగా, ఫిజిక్స్ ప్రశ్నలు సులభంగా వచ్చాయని చెప్తున్నారు. గణితం ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండటంతో విద్యార్థులు అర్థం చేసుకొనేందుకు ఇబ్బందులుపడ్డారు. నిరుడుతో పోల్చితే ఈసారి గణితం సులభంగానే వచ్చిందని గణితం సబ్జెక్టు నిపుణుడు ఎంఎన్ రావు తెలిపారు. సాధారణ, ప్రతిభ ఉన్న విద్యార్థి సైతం అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేలా ప్రశ్నలున్నాయని ఆయన విశ్లేషించారు.
రెండో రోజు 90శాతం హాజరు
రెండోరోజు మంగళవారం ఎంసెట్ పరీక్షలకు 90.04శాతం మంది హాజరైనట్టు కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. తెలంగాణ, ఏపీ నుంచి మొత్తం 52,796 మంది విద్యార్థులు హాజరైనట్టు వెల్లడించారు. తెలంగాణలో 93.6శాతం, ఏపీలో 78.9 శాతం చొప్పున మొత్తం 90.4 శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు బుధవారంతో ముగుస్తాయని పేర్కొన్నారు.