హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): ఆ చిన్నారి వయస్సు తొమ్మిదేండ్లే. కానీ అపార జ్ఞాన సంపద ఆమె సొంతం. సైకాలజీ పరిభాషలో గిఫ్ట్డ్ చైల్డ్. ఏది అడిగినా ఇట్టే చెప్పేస్తుంది. తన వయస్సు, స్థాయికి మించిన పనులుచేస్తూ అందరిని అబ్బురపరుస్తున్న ఆ చిన్నారి.. పదో తరగతి పరీక్షలు రాస్తానంటున్నది. అనుమతివ్వాలని విద్యాశాఖకు దరఖాస్తు చేసుకున్నది. హైదరాబాద్కు చెందిన దీక్ష 2012 జనవరి ఒకటిన జన్మించింది. ప్రస్తుతానికి ఐదో తరగతి చదువుతున్నది. 2022 మార్చి/ ఏప్రిల్ మాసాల్లో నిర్వహించే ఎస్సెస్సీ పరీక్షలకు అనుమతివ్వాలని దీక్ష దరఖాస్తు చేసుకున్నది. పరిశీలించిన అధికారులు ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపించారు. దీక్ష చదువుతోపాటు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఐదో తరగతి చదువుతూనే ఇంటర్ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నది. పాఠశాలకు వెళ్లకుండా, తరగతులకు హాజరుకాకుండానే అనేక విషయాలపై అవగాహన పెంచుకుంటున్నది. సైన్స్లో దిట్ట అయిన దీక్ష.. కరోనా వైరస్ ములాలను, వైరస్ పరిణామక్రమాన్ని చిన్న వయస్సులోనే అందరికీ విడమరిచి చెప్పింది.