హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ఆస్తి పన్ను వసూళ్లలో మున్సిపాలిటీలు సరికొత్త రికార్డును సృష్టించాయి. 98 శాతం పన్నులు వసూలయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా 2022-23లో రూ.825 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. ఉమ్మడి జిల్లా కేంద్రాలను వెనక్కి నెడుతూ హైదరాబాద్ శివారు ప్రాంతాలు ఆస్తి పన్ను వసూళ్లలో ముందువరుసలో నిలిచాయి. రాష్ట్రంలో అత్యధికంగా ఆస్తి పన్ను వసూలైన టాప్-10 పట్టణాల్లో 4 పట్టణాలు నగర శివారు ప్రాంతాలే కావటం గమనార్హం. 2018-19తో పోల్చితే, 2022-23లో రూ.380 కోట్ల పన్ను అదనంగా వసూలైంది. ఇది 185 శాతం అధికం.
ఉమ్మడి జిల్లా కేంద్రాలతో నగర శివారు ప్రాంతాల మున్సిపాలిటీలు ఆస్తి పన్ను చెల్లింపుల్లో పోటీపడ్డాయి. నిజాంపేట నగర పాలక సంస్థ రాష్ట్రంలో ఆస్తి పన్ను వసూళ్లలో రెండో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో వరంగల్ ఉన్నది. మణికొండ, నార్సింగి, బడంగ్పేట్ టాప్-10 పట్టణాల్లో నిలిచాయి. ఆస్తి పన్ను వసూలుపై మున్సిపల్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. పట్టణ ప్రగతి ద్వారా మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నందున ప్రజలు కూడా పన్నులు చెల్లించడానికి ముందుకొచ్చారు. శివారు ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణం పెరగడం కూడా ఆస్తి పన్ను చెల్లింపులు పెరగటానికి దోహదం చేశాయి.
చెల్లింపులు సులభతరం
ఆస్తి పన్ను చెల్లించడానికి సులువైన విధానాలను మున్సిపల్ శాఖ తీసుకొచ్చింది. వాట్సాప్, ఆన్లైన్, ఈ-సేవ, మీసేవ, ఫోన్పే, గూగుల్పే తదితర ప్లాట్ఫాంల ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పించింది. ప్రతి మంగళ, గురు, ఆదివారాలను గ్రీవెన్స్ డేగా నిర్ణయించి పన్ను చెల్లింపు అభ్యంతరాలు, సమస్యలను పరిష్కరిస్తున్నారు. దీంతో ప్రజల నుంచి ఆస్తి పన్ను చెల్లింపుల్లో అవగాహన పెరిగింది.