మాదాపూర్, మే 30: మెడను పైకి ఎత్తలేక తీవ్ర సమస్యలతో ఇబ్బందిపడుతున్న 80 ఏండ్ల వృద్ధుడికి కొండాపూర్లోని కిమ్స్ దవాఖానా వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ఉపశమనం కల్పించారు. వెన్నెముక, మెడ కలిసి గట్టిగా బిగుసుకుపోవడంతో ఆయనకు ఈ సమస్య తలెత్తిందని, వైద్య పరిభాషలో దీన్ని ‘యాంకీలోజింగ్ స్పాండిలైటిస్’ అంటారని స్పైన్ సర్జన్ డాక్టర్ కృష్ణ చైతన్య వెల్లడించారు. సాధారణంగా ఎవరిలోనైనా అవసరమైన చోట వెన్నెముక కొంత మేరకు వంపు తిరిగి ఉంటుందని, కానీ ఈ వృద్ధునిలో అలా వంపు లేకుండా వెన్నెముక గట్టిపడిపోవడం వల్ల మెడను ముందుకు వాల్చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఎంతో సంక్లిష్టమైన ఈ సమస్యను పరిష్కరించేందుకు అత్యాధునిక నేవిగేషన్ సదుపాయాలు, నిపుణులైన వైద్యుల సహకారంతో శస్త్రచికిత్స చేశామని వివరించారు.