Tigers | హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): అడవిలో పులుల సగటు జీవిత కాలం సాధారణంగా 10 నుంచి 12 ఏండ్లలోపు ఉంటుందని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ తెలిపింది. వృద్ధాప్యం, వ్యాధులు, అంతర్గత పోరాటాలు, విద్యుదాఘాతం, రోడ్లు, రైలు ప్రమాదాల కారణంగా ఎక్కువగా పులులు మరణిస్తున్నాయని పేర్కొంది. ఐదేండ్లుగా చూస్తే ఎక్కువగా పెద్ద పులుల మరణాలున్నాయని, వీటిలో ఎక్కువ శిశు మరణాలున్నట్టు గుర్తించామని పేర్కొంది.
దేశంలో వివిధ రాష్ర్టాల్లో మొత్తం 661 పులులు మృతి చెందాయని, వీటిలో సహజ, ఇతర కారణాలతో 516 పులులు మృతి చెంగా, మరో 126 పులులు వేటకు బలయ్యాయని తెలిపింది. అసహజంగా 19 పులులు మరణించినట్టు వెల్లడించింది. పులులను వేటాడుతున్న వారిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చర్యలు తీసుకుంటున్నాయని, అరెస్ట్లు చేస్తున్నాయని తెలిపింది. ప్రాజెక్టు టైగర్, టైగర్ రేంజ్ రాష్ర్టాలు పులుల సంరక్షణపై అవగాహన పెంచుతున్నాయని పేర్కొన్నది. ఇందుకోసం రాష్ర్టాలకు నిధులిస్తున్నామని, వన్యప్రాణుల ఆవాసాల సమగ్ర అభివృద్ధికి రాష్ర్టాలకు నిధులు మంజూరు చేస్తున్నట్టు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ పేర్కొంది.