TGSRTC | రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ రికార్డు సృష్టించిందని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. రక్షాబంధన్ పర్వదినం నాడు 63 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిందని వెల్లడించారు. వీరిలో 41.74 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది, అధికారులనుఅభినందించారు. భారీ వర్షాల్లోనూ నిబద్ధత, అంకిత భావం, క్రమశిక్షణతో పనిచేశారని వారి సేవలను కొనియాడారు.
”రక్షాబంధన్ పర్వదినం నాడు టీజీఎస్ఆర్టీసీ బస్సులు రికార్డు స్థాయిలో 38 లక్షల కిలోమీటర్లు తిరిగాయి. సగటున 33 లక్షల కిలోమీటర్లు తిరుగుతుండగా.. సోమవారం నాడు 5 లక్షల కిలోమీటర్లు అదనంగా తిరిగాయి. ఒక్కరోజులో మొత్తంగా 63 లక్షల మంది వరకు ప్రయాణించగా.. అందులో అత్యధికంగా రీజియన్ల వారీగా హైదరాబాద్ 12.91 లక్షలు, సికింద్రాబాద్ 11.68 లక్షలు, కరీంనగర్ 6.37 లక్షలు, మహబుబ్నగర్ 5.84 లక్షలు, వరంగల్ 5.82 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరవేశాయి. 97 డిపోలకు గాను 92 డిపోలు 100 శాతానికి పైగా ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్)ను నమోదు చేశాయి. రాఖీ నాడు రికార్డు స్థాయిలో 32 కోట్ల వరకు రాబడి వచ్చింది. అందులో మహాలక్ష్మి పథకం ద్వారా రూ.17 కోట్లు, నగదు చెల్లింపు టికెట్ల ద్వారా 15 కోట్ల వరకు వచ్చింది. ఆర్టీసీ చరిత్రలో ఇది ఆల్టైం రికార్డు.” అని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. దేశ ప్రజా రవాణా వ్యవస్థలో టీజీఎస్ఆర్టీసీ రాఖీ పండుగ రికార్డులు ఒక మైలురాయిగా నిలిచిపోతాయని అన్నారు.
రాఖీ పండుగ రద్దీ, మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుస్తు చర్యలు తీసుకున్నామని, గత రెండు వారాల్లో మూడు సార్లు క్షేత్ర స్థాయి సిబ్బందితో వర్చ్వల్గా యాజమాన్యం సమావేశం నిర్వహించిందని తెలిపారు. మూడు రోజుల్లో 2587 ప్రత్యేక బస్సులను నడిపినట్లు వివరించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా మెరుగైన, నాణ్యమైన సేవలను అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. ఈ ఆదేశాల ప్రకారం డిపో మేనేజర్లు గేట్ మీటింగ్లు ఏర్పాటు చేసి సిబ్బందిని మోటివేట్ చేశారని చెప్పారు.
ముందస్తు ప్రణాళికతో పాటు సిబ్బంది నిబద్దతతో పనిచేయడం వల్ల రాఖీ పండుగకు ప్రయాణికులను క్షేమంగా సిబ్బంది గమ్యస్థానాలకు చేర్చారన్నారు. సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూనే ఎక్స్ట్రా మైల్ లో భాగంగా సేవతర్పరతను సిబ్బంది చాటడం అభినందనీయమన్నారు. టీజీఎస్ఆర్టీసీకి సహకరిస్తూ.. ప్రజా రవాణా వ్యవస్తను ఆదరిస్తోన్న, ప్రోత్సహిస్తోన్న ప్రయాణికులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.