హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): కాలుష్యరహితమైన ఏకైక రవాణా సదుపాయం మెట్రోయేనని, హైదరాబాద్లో దీన్ని మరింతగా విస్తరించడంలో భాగంగా భవిష్యత్తులో ఔటర్ రింగ్రోడ్డు చుట్టూ మెట్రో లైన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల శంషాబాద్ ఎయిర్పోర్టుకు మెట్రో రైలు కనెక్టివిటీ లేదని.. దీన్ని అధిగమించేందుకే రూ.6,250 కోట్లతో మెట్రో రైలును మరింత అభివృద్ధి చేసుకోబోతున్నామని చెప్పారు. రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రో మార్గానికి శుక్రవారం మైండ్స్పేస్ జంక్షన్ వద్ద సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
అనంతరం పోలీస్ అకాడమీలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. కేంద్రప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా, రాష్ట్రప్రభుత్వం తరపున నగరానికి అవసరమైన సౌకర్యాలన్నీ కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. నగరాభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తామని, అవసరమైన ఆర్థిక ప్రేరణ ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టంచేశారు. విశ్వనగరం హైదరాబాద్ను పచ్చదనంతో కళకళలాడేలా తీర్చిదిద్దాలని సీఎం అభిలషించారు. హైదరాబాద్కు మెట్రో మణిహారంగా నిలువనున్నదన్న సీఎం కేసీఆర్.. మైండ్స్పేస్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మెట్రో పనులకు రాష్ట్ర ప్రభుత్వం, జీఎమ్మార్, హెచ్ఎండీఏ వందశాతం నిధులతో శ్రీకారం చుట్టామని తెలిపారు. భవిష్యత్తులో నగరం చుట్టూ మెట్రోను విస్తరిస్తామని, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో త్వరలోనే రెండో రన్వే కూడా అందుబాటులోకి రానున్నదని వెల్లడించారు.
సమైక్య పాలనలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని, సమగ్రత లేకపోవడంతో చాలా విషయాల్లో బాధలు అనుభవించామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. స్వరాష్ట్రంలో బ్రహ్మాండంగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దుకున్నామని, కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు క్లియరెన్స్లు సాధించి తాగు, సాగు నీటి వసతులను కల్పించుకున్నామని చెప్పారు. ‘చరిత్రలోనే కాదు, వర్తమానంలోనూ హైదరాబాద్ నగరం గొప్పది. చెన్నై కంటే దేశంలోని అనేక నగరాల కంటే ముందే.. హైదరాబాద్కు 1912లోనే కరెంటు వచ్చింది. ఇక్కడ కరెంటు వచ్చినంక 1925లో అప్పటి మద్రాస్ నగరానికి కరెంటు వచ్చింది.
కానీ సమైక్యపాలనలో కరెంటు కష్టాలను తెలంగాణ అనుభవించింది. మాకు కరెంటు ఇవ్వండి.. లేకపోతే వేరే రాష్ర్టాలకు వెళ్లిపోతమని ఇందిరాపార్క్ దగ్గర పారిశ్రామికవేత్తలు కరెంటు కోసం ధర్నాలు చేసిన సందర్భాన్ని కళ్లారా చూసినం. ఇప్పుడు 24 గంటలు ఒక్క క్షణం కూడా కరెంటు పోనటువంటి పరిస్థితిని కల్పించుకున్నం. రాష్ట్రంలో ఉన్న అన్ని పవర్జనరేటింగ్ స్టేషన్లతోను, స్టేట్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్, నేషనల్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్తో కూడా హైదరాబాద్ నగరాన్ని అనుసంధానం చేసినం. నేనే స్వయంగా పర్యవేక్షించి, పట్టుబట్టి హైదరాబాద్ను పవర్ ఐలాండ్గా మార్చిన. ఒక్కమాటలో చెప్పాలంటే.. న్యూయార్క్, లండన్, పారిస్ వంటి నగరాల్లో కరెంటు పోవచ్చునేమోగానీ హైదరాబాద్లో మాత్రం కరెంటు పోదు’ అని కేసీఆర్ వివరించారు.
ఒకప్పుడు గొప్ప నగరంగా ఉన్న హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమైక్య పాలకుల నిర్లక్ష్యానికి గురైందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. సమగ్రత అనేది లేకపోవడం వల్ల చాలా విషయాల్లో బాధలు అనుభవించామన్నారు. హైదరాబాద్లో ఏ బస్తీకి వెళ్లినా, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా చాలా భయంకరమైన తాగునీటి బాధలు కనిపించేవని చెప్పారు. పేదల బస్తీలో మంచినీటి కనెక్షన్ కావాలంటే జలమండలి వాళ్లు.. రూ.80 లక్షల నుంచి కోటి రూపాయల వరకు అడిగేవారంటూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్గౌడ్ అప్పట్లో తనతో చెప్పిన విషయం ఆవేదనకు గురి చేసిందని సీఎం పేర్కొన్నారు.
శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ వంటి అనేక శివారు ప్రాంతాల్లో మంచినీళ్లు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డ సందర్భాలున్నాయన్నారు. కృష్ణా, గోదావరి నుంచి పథకాలకు అన్ని క్లియరెన్స్లను సాధించి బ్రహ్మాండమైన మంచినీటి వసతులను నగరమంతటా ఏర్పాటు చేసుకున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు కే తారకరామారావు, సబిత, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, బేతి సుభాష్రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ లు పట్నం మహేందర్రెడ్డి, దయానంద్ గుప్త, ఎంఎస్ ప్రభాకర్, కార్పొరేషన్ల చైర్మన్లు గజ్జెల నాగేశ్, రావుల శ్రీధర్రెడ్డి, ఉప్పల శ్రీనివాస్గుప్త, మోతె శోభన్రెడ్డి, అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, మేడ్చల్ జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, బీఆర్ఎస్ నేతలు తలసాని సాయికిరణ్యాదవ్, కిశోర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రెండోదశ విస్తరణ పూర్తయ్యాక గంటకు 100-120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే మెట్రో రైలులో హైదరాబాద్లోని ఏ చివరి నుంచైనా 20-25 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకునే సదుపాయం కలుగుతుందని అన్నారు. 31 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రోలైన్లో దాదాపుగా 25 కిలోమీటర్లు ఎలివేటెడ్ మార్గంలో, రెండున్నర కిలోమీటర్లు భూగర్భ మార్గంలో, కిలోమీటర్ రోడ్డు మార్గంలో ప్రయాణం సాగుతుందన్నారు. బీహెచ్ఈఎల్ నుంచి మెట్రో కనెక్టివిటీని పెంచాల్సిన అవసరముందని సీఎం అభిప్రాయపడ్డారు. కరోనా సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుని మెట్రోలో నాలుగున్నర లక్షల మంది ప్రతిరోజూ ప్రయాణిస్తున్నారని, ఎయిర్పోర్టు కనెక్టివిటీ పెరిగిన తర్వాత ప్రయాణికుల సంఖ్య మరో 70వేల నుంచి 80వేల వరకు అదనంగా పెరుగుతుందని చెప్పారు. మెట్రో కోసం కృషి చేసిన పురపాలకశాఖ, హెచ్ఎండీఏ, జీఎంఆర్, మైట్రోలైన్ నిర్వాహకులను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అభినందించారు.
దేశంలో ఏ నగరంలోనూ లేనటువంటి అద్భుతమైన సమశీతల వాతావరణం హైదరాబాద్ సొంతమని సీఎం కేసీఆర్ అన్నారు. భూకంపాలకు తావు లేకుండా, అత్యంత భద్రమైన నగరంగా హైదరాబాద్కు పేరున్నదన్నారు. అన్ని భాషలూ, అన్ని సంస్కృతుల వాళ్లు హైదరాబాద్ వచ్చి సహజీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. చార్మినార్ దగ్గర ఉన్న గుల్జార్హౌస్ 300 సంవత్సరాల కిందట ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారితో వెలసిన ప్రాంతమని కేసీఆర్ వివరించారు. చరిత్రలో నిజమైన కాస్మొపాలిటన్ సిటీగా నిలిచిన హైదరాబాద్ అన్ని వర్గాలను, కులాలను, మతాలను, ప్రాంతాలను, జాతులను.. అందరినీ అక్కున చేర్చుకుని అద్భుతమైన విశ్వనగరంలా రూపుదిద్దుకుందన్నారు.
అందుకే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 500 గొప్ప పరిశ్రమలు ఇక్కడ కొలువుదీరడంతో పారిశ్రామిక రంగంలో నగరం ముందుకు దూసుకుపోతున్నదని చెప్పారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ) కింద ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను నిర్మించుకుని ట్రాఫిక్ కష్టాలను కూడా తీర్చుకుంటున్నామని ఆయన తెలిపారు. టీఎస్ బీపాస్ అమల్లోకి వచ్చిన తర్వాత అద్భుతమైన నిర్మాణాలు కొలువుదీరుతున్నాయని, 40-50 అంతస్థుల ఆకాశ హర్మ్యాలకు కూడా అనుమతులు ఇస్తున్నామని వెల్లడించారు. ఆఫీస్ స్పేస్లోగానీ, రియల్ ఎస్టేట్ రంగంలోగానీ నిబంధనల్ని సడలించి నగరాభివృద్ధికి వెసులుబాటు కల్పించామని తెలిపారు. నగరం పరిధి పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైన మౌలిక వసతుల కల్పన పురపాలక శాఖ చేపట్టాలని సూచించారు.
‘వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డుతోపాటు, బెస్ట్ లివబుల్ సిటీ అవార్డును హైదరాబాద్ దక్కించుకోవడం గర్వంగా ఉంది. ఇంకా ఎన్నెన్నో అవార్డులు నగరానికి రావాలి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. నగరం ఖ్యాతిని మరింత పెంచేందుకు కృషి చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, చీఫ్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ కమిషనర్ను ఆయన అభినందించారు. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో అన్నిరంగాల్లో పురోగమిస్తున్న హైదరాబాద్.. మరిన్ని విజయాలను సాధించాలని సీఎం అభిలషించారు.
నగరానికి బతికేందుకు వచ్చేవారు, బతుకు బాగుందని తెలిసి వచ్చేవారు.. ఏటా లక్షల సంఖ్యలో ఉంటున్నారని, అందుకు అనుగుణంగా మురుగునీటి నిర్వహణ, మంచినీటి సదుపాయాలను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రోజురోజుకూ భూతాపం పెరిగిపోతున్నందున విశ్వనగరమైన హైదరాబాద్ పచ్చదనంతో కళకళలాడేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఎల్బీనగర్ ఫతుల్లాగూడలో అన్ని మతాల కోసం నిర్మించిన శ్మశాన వాటిక గురించి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెబుతుంటే గర్వంగా అనిపించిందని చెప్పారు. పేదల కాలనీల్లో ఉన్న భూముల గురించి ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ వినతిపత్రం అందజేశారని, వాటన్నింటినీ పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.