హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని అందజేసే బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతలను ప్రభుత్వం ఎంపికచేసింది. 2022 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్ విద్యలో ముగ్గురు ప్రిన్సిపాళ్లు, 8 మంది లెక్చరర్లు, పాలిటెక్నిక్ కాలేజీల్లో నలుగురు, కళాశాల విద్య, వర్సిటీల్లో 49 మంది ఆచార్యులు, లెక్చరర్లకు రాష్ట్రస్థాయి బెస్ట్ టీచర్ అవార్డులు వరించాయి. శుక్రవారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఈ మేరకు రెండు వేర్వేరు జీవోలను జారీచేశారు. సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని రవీంద్రభారతిలో ప్రభుత్వం నిర్వహించే గురుపూజోత్సవంలో వీరికి అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు కింద సర్టిఫికెట్, మెమెంటో అందజేసి శాలువాతో సన్మానిస్తారు.