హైదరాబాద్, నవంబర్ 22(నమస్తే తెలంగాణ): ఈ సంక్రాంతికి కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ.. యవతులు, మహిళలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నది. పండుగ రోజు అందమైన ముగ్గులు వేస్తే ఏకంగా రూ. 6 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నది. పాటలు పాడి గెలిచినా బహుమతులు అందజేయనున్నది. సోమవారం హైదరాబాద్లో ఆ శాఖ మంత్రి జీ కిషన్రెడ్డి వివరాలు వెల్లడించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పోటీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జాతీయస్థాయిలో ప్రథమ బహుమతి రూ.6 లక్షలు, ద్వితీయ బహుమతి రూ.5 లక్షలు, తృతీయ బహుమతి రూ.4 లక్షలు, రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి లక్ష, ద్వితీయ బహుమతి రూ.75 వేలు, తృతీయ బహుమతి రూ.50 వేలు, జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి రూ.10 వేలు, ద్వితీయ బహుమతి రూ.5 వేలు, తృతీయ బహుమతి రూ.3 వేలు ఇవ్వనున్నట్టు తెలిపారు. సంక్రాంతిని చాలా రాష్ర్టాల్లో వివిధ పేర్లతో నిర్వహిస్తారని, ఈ సంస్కృతికి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు పోటీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పూర్తి వివరాలకు www.indiaculture.nic.in ను సంప్రదించాలని సూచించారు.
అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 6న 10 లక్షల మంది ఎస్సీ విద్యార్థుల అకౌంట్లలో డీబీటీ ద్వారా స్కాలర్షిప్లు జమచేస్తామని మంత్రి కిషన్రెడ్డి చెప్పారు. అంబేద్కర్ స్మృతులైన పంచతీర్థాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి, వాటిని దర్శించలేని దళితులకు ఆన్లైన్, సోషల్ మీడియాలో చూపిస్తామని తెలిపారు. జనవరి 23న సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా ఢిల్లీ, మణిపూర్, నాగాలాండ్, కోల్కతాలో ఏర్పాటు చేసిన మ్యూజియంలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.