హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ప్రకృతి వైద్యానికి హైదరాబాద్ కేంద్రంగా మారాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి టీ హరీశ్రావు ఆకాంక్షించారు. ఇందుకోసం నేచర్క్యూర్ హాస్పిటల్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు రాష్ట్ర అధికారుల బృందం ఇటీవల విజయవాడలోని మంతెన సత్యనారాయణ ప్రకృతి వైద్యశాలను సందర్శించి, నివేదికను రూపొందించింది. దీనిపై శనివారం హైదరాబాద్లోని అరణ్య భవన్లో మంత్రి హరీశ్రావు వైద్యశాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. నేచర్క్యూర్ హాస్పిటల్ అభివృద్ధికి రూ.6 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.
వెంటనే టెండర్ ప్రక్రియ చేపట్టి పనులు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. సామాన్యులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సహా ప్రతి ఒక్కరూ ప్రకృతి వైద్యం కోసం హైదరాబాద్కే వచ్చేలా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. నాచురోపతి ఓపీ, ఐపీ సేవలకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రకృతి వైద్యానికి తగినట్టు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా పచ్చదనాన్ని పెంచాలని సూచించారు. ప్రత్యేక డైట్కు కావాల్సిన వంట గది, ఇతర సామగ్రిని సమకూర్చుకొని, తగినంత మంది వైద్య సిబ్బందిని నియమించుకోవాలని మంత్రి హరీశ్రావు ఆదేశించారు. కార్యక్రమానికి హెల్త్ సెక్రటరీ రిజ్వీ, ఆయుష్ డైరెక్టర్ ప్రశాంతి, డీఎంఈ రమేశ్రెడ్డి తదితరులు హాజరయ్యారు.