హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ): 2022లో 6.59 లక్షల పాస్పోర్ట్లు జారీ చేసి హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ కార్యాలయం రికార్డు సృష్టించింది. ఏడేండ్లలో నిరుడు అత్యధికంగా సేవలందించిన ఘనత పాస్పోర్ట్ కార్యాలయాలు దక్కించుకున్నాయి. హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య బుధవారం 2022-వార్షిక రిపోర్ట్ను విడుదల చేశారు. విభిన్న రకాల పాస్పోర్ట్ సేవలతో ఈ ఏడాది రూ.118 కోట్ల ఆదాయం ఆర్జించినట్టు వివరించారు. 2020, 2021లో కరోనా కారణంగా పాస్పోర్ట్ సేవలకు కొంత అంతరాయం ఏర్పడినా, సేవలందించడంలో విజయవంతమైనట్టు పేర్కొన్నారు.
దరఖాస్తుదారులకు సేవలందించడమే కాకుండా సామాజిక బాధ్యతలో భాగంగా పర్యావరణం, పరిశుభ్రత, దేశభక్తి, రక్తదానం తదితర అంశాలపై అవగాహన కల్పించే పలు రకాల కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్టు తెలిపారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో వేగాన్ని పెంచడం కోసం ప్రతీ శనివారం ప్రత్యేక పాస్పోర్ట్ డ్రైవ్లు చేపట్టామని పేర్కొన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, పరిశోధకులు, ఇమ్మిగ్రెంట్స్కు ప్రత్యేక మేళాలు నిర్వహించి, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్స్ ప్రక్రియ సులభతరం చేశామని తెలిపారు. ప్రతీ మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ‘చాట్ విత్ ఆర్పీవో’ పేరుతో దరఖాస్తుదారులకు అందుబాటులో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.