హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీల్లోనూ ఈ ఏడాది 726 సీట్లు మిగిలాయి. ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్ల భర్తీ తర్వాత నిర్వహించిన ఎంసెట్ స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ తర్వాత సైతం 18 శాతం సీట్లు మిగిలాయి. మొత్తం 15 యూనివర్సిటీ కాలేజీలుంటే ఒకే ఒక్క కాలేజీలోనే వందశాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఇంజినీరింగ్లో ఈ ఏడాది మొత్తం 79,856 సీట్లుంటే 57,177 సీట్లు (71 శాతం) నిండాయి. మూడువిడతల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత 22,679 సీట్లు మిగిలాయి. ఎంసెట్ స్పెషల్ రౌండ్ సీట్ల కేటాయింపును అధికారులు బుధవారం పూర్తిచేశారు. తొలివిడత, తుదివిడత, స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ తర్వాత కూడా 29 శాతం సీట్లు మిగిలాయి. సీట్లు పొందిన విద్యార్థులంతా ఈ నెల 26లోగా ఫీజు చెల్లించి, కాలేజీల్లో రిపోర్ట్చేయాలని, లేదంటే సీట్లను రద్దుచేస్తామని అధికారులు వెల్లడించారు.
నేడు స్పాట్ అడ్మిషన్లు
ఇంజినీరింగ్, బీ ఫార్మసీ కోర్సుల్లో మిగిలి న సీట్ల భర్తీకి గురువారం స్పాట్ అడ్మిషన్లు ఇవ్వనున్నారు. స్పాట్ ద్వారా యా జమాన్యాలే సీట్లను భర్తీ చేసుకొనే అవకాశాన్ని కల్పించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను tseamcet.nic.in వెబ్సైట్లో పెట్టారు.