హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): విద్యార్థులకు మహాత్మాగాంధీ చరిత్రను తెలియజెప్పేందుకు, వారిలో దేశ భక్తిని పెంపొందించేందుకు తెలుగు, హిందీ భాషల్లో రూపొందించిన చిత్రాన్ని రాష్ట్రంలోని 2.77 లక్షల సీట్ల సామర్థ్యం ఉన్న 563 స్రీన్లపై ప్రదర్శించనున్నట్టు సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.
విద్యార్థులను థియేటర్లకు తీసుకెళ్లేందుకు రవాణా ఏర్పాట్లను సైతం ప్రభుత్వమే చేస్తుందని, వారికి ఉచితంగా వాటర్ బాటిళ్లు, స్నాక్స్ అందిస్తామని చెప్పారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించాలని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తాను ఆదేశించారు. శుక్రవారం మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో ఫిలిం డెవలప్మెంట్శాఖ అధికారులు, ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశానికి స్వాత్రంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, యువతీయువకులు ప్రతి ఒకరినీ ఈ వేడుకల్లో భాగస్వాములను చేసేలా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ఇంటికో జెండాను అందజేస్తున్నామని చెప్పారు. సమావేశంలో తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, కార్యదర్శులు అనుపమ్రెడ్డి, దామోదర్ ప్రసాద్, ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బసిరెడ్డి, ఎఫ్డీసీఈడీ కిశోర్బాబు, యూఎఫ్వో, క్యూబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
స్వంతత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా పట్టణాలు, నగరాల్లో ఇంటింటికీ జాతీయ జెండాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ప్రతి వెయ్యి ఇండ్లకు ఐదుగురు సిబ్బందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి జాతీయ జెండాలను పంపిణీ చేయాలని మున్సిపల్శాఖ కమిషనర్లకు సీడీఎంఏ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. పట్టణాల్లో ఫ్రీడమ్ పార్కులు ఏర్పాటు చేయాలని, 75, 750, 7,500, 75,000 సంఖ్య ఉండేలా మొక్కలు నాటాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.