శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 2: శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ.50 కోట్ల డ్రగ్స్ను అధికారులు శనివారం పట్టుకున్నారు. లావోస్ నుంచి సింగపూర్ మీదుగా హైదరాబాద్కు వచ్చిన నలుగురు మహిళల నుంచి 5 కిలోలకు పైగా కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. మహిళలు అనుమానాస్పదంగా కనిపించడంతో డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేశారు. నాలుగు హ్యాండ్బ్యాగ్స్, ఒక సూట్కేస్ కింది భాగంలో డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. తమకు లావోస్ ఎయిర్పోర్టులో కొంత మంది కలిసి కొన్ని డబ్బులు ఇచ్చి దీనిని హైదరాబాద్ ఎయిర్పోర్టులో డెలివరీ చేయాలని చెప్పినట్టుగా అధికారులకు మహిళలు వెల్లడించారు. మిగతా వారిని అరెస్టు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వివరించారు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ హైదరాబాద్కు చేరుకోవడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది.