మేడ్చల్, జూన్ 13 (నమస్తే తెలంగాణ)/తిరుమలగిరి: నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్ఫోర్స్ అధికారుల బృందం తనిఖీలను విస్తృతం చేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో వివిధ విత్తన కంపెనీలలో నిర్వహిస్తున్న తనిఖీల్లో గడువు ముగిసిన విత్తనాలు లభించడంతో రెండు కంపెనీలపై కేసులు నమోదుచేశారు. గడువు ముగిసిన రూ.67 లక్షల విలువైన 450 క్వింటాళ్ల మొక్కజొన్న, మిర్చి, వివిధ రకాల కూరగాయల విత్తనాలను సీజ్చేశారు. కంపెనీ యజమానులపై కేసులు నమోదు చేసినట్టు వ్యవసాయాధికారి మేరీ రేఖ తెలిపారు. మేడ్చల్ జిల్లావ్యాప్తంగా ఉన్న 110 విత్తన కంపెనీల్లో తనిఖీలను నిర్వహించే పనిలో ఉన్నారు. నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరిని సూర్యాపేట జిల్లా పోలీసులు రిమాండ్కు తరలించారు. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన పెండ్యాల వీరాంజనేయులు హైదరాబాద్లోని కొంపల్లిలో ఉంటూ బైక్పై గ్రామాలకు వెళ్లి రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నాడు. సూర్యాపేట జిల్లా నాగారం పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో వీరాంజనేయులు పట్టుబడ్డాడు. అతడినుంచి 35 కిలోల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్రుపల్లికి చెందిన హనుమంతరావు .. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలోని కంచేపల్లిలో ఉంటూ నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్టు తేలింది. ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లి అతడిని పట్టుకొని 431 కిలోల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్టు నాగారం సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఇరువురినీ రిమాండ్కు తరలించారు.