హైదరాబాద్: రోడ్డు మార్గంలో పోలీసులకు దొరికిపోతామనుకున్నారో ఏమో.. గంజాయి (Ganja) స్మగ్లర్లు తాజాగా రైళ్లను ఎంచుకుంటున్నారు. మూడు రోజుల క్రితం ఒడిశా నుంచి ముంబైకి గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్న విషయం మరవక ముందే సికింద్రాబాద్లో మరోసారి భారీమొత్తంలో పట్టుబడింది. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఓ ప్రయానికుడి వద్ద పోలీసులు 42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.8 లక్షలు ఉంటుందని తెలిపారు. గంజాయిని తరలిస్తున్న నిందితుడిని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు.
రైలు ద్వారా ఒడిశా నుంచి సికింద్రాబాద్ మీదుగా ముంబైకి గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ఈ నెల 9న అరెస్టు చేశారు. ఒడిశాకు చెందిన అభిజిత్ బోయ్ (20) గంజాయిని ముంబైకి సరఫరా చేసేందుకు ఈ నెల 7న బలూగ్గామ్ రైల్వే స్టేషన్లో కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. 8న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే జీఆర్పీ పోలీసులు రైలును తనిఖీ చేస్తుండగా అభిజిత్ అనుమానాస్పదంగా కనిపించాడు. అతడి బ్యాగ్ను తనిఖీ చేయగా సుమారు రూ.4.40 లక్షల విలువ చేసే 22కిలోల గంజాయి పట్టుబడింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.