చిగురుమామిడి, జనవరి 24 : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం సర్పంచ్ జకుల రవి సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో ఆడపిల్ల పుడితే రూ.4,016 సొంతంగా అందజేస్తానని ప్రకటించారు. అందులో భాగంగా బుధవారం స్థానిక ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ చేతుల మీదుగా నలుగురు మహిళలకు ఈ పథకం కింద నగదు అందజేయనున్నారు. గత డిసెంబర్ నుంచి గ్రామంలో పుట్టిన ఆడపిల్లలకు ఈ పథకం వర్తింపజేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ నుంచి ఇప్పటివరకు గ్రామంలో నలుగురు ఆడపిల్లలు జన్మించారని తెలిపారు. గ్రామంలో పేద కుటుంబాల్లో పుట్టిన ఆడపిల్లల కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని స్థానికులు పేర్కొన్నారు.