హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు కుట్రచేయటంపై మునుగోడు ప్రజలు భగ్గుమన్నారు. బీజేపీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా నియోజకవర్గం వ్యాప్తంగా బుధవారం రాత్రి భారీ ఆందోళనలు నిర్వహించారు. అనేక గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ధర్నాలు నిర్వహించారు. కుట్రల బీజేపీని ఉప ఎన్నికల్లో ఓటు ద్వారా బొంద పెడుతామని ప్రతిజ్ఞలు చేశారు. అనేకచోట్ల బీజేపీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. నిరసనలు, ధర్నాల్లో యువకులు, మహిళలతోపాటు వృద్ధులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని టీఆర్ఎస్కు సంఘీభావం ప్రకటించారు. బీజేపీ తీరుపై రాజకీయ నిపుణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించిందని విమర్శిస్తున్నారు.
వాస్తవానికి ఈ ఉప ఎన్నిక రాష్ట్రంలో బీజేపీ తన సత్తా చాటుకోవడానికి ఏరికోరి తెచ్చింది. ప్రజలు కోరుకున్న ఎన్నిక అసలే కాదు. దీంతో ప్రజలు బీజేపీపై, ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై ఆది నుంచి వ్యతిరేకంగానే ఉన్నారు. ఇది గమనించిన బీజేపీ అభ్యర్థి, బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముందు జోరుగా ప్రచారం చేసిన ఆయన .. ఇటీవలి కాలంలో కోపంతో ఊగిపోతున్నారు. అడ్డదారిలో గెలుపు కోసం కుట్రలు మొదలుపెట్టిన బీజేపీ, తొలుత స్థానిక టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల కొనుగోలు చేసింది. నేతల స్థాయిని బట్టి నజరానాలు ఇచ్చింది. కొందరికి కార్లు బహుమతిగా ఇచ్చింది.
స్థానిక నేతల కొనుగోలు పూర్తి కావడంతో ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలపైనే కన్నేసిందని అంటున్నారు. అయినా, మునుగోడులో బీజేపీకి చావుదెబ్బ తప్పదని అంటున్నారు. ఇప్పటికే మూడో స్థానం కోసం కొట్లాడుతున్న ఆ పార్టీకి, తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలతో డిపాజిట్ కూడా రాకపోవచ్చని ఎన్నికల నిపుణులు అంటున్నారు. తాజా కుట్రను పోలీసులు భగ్నం చేయటంతో ఇక ఆ ఆశ కూడా పోయినట్టేనని విశ్లేషకులు అంటున్నారు. బుధవారంనాటి పరిణామం తర్వాత ఆయన ప్రచారం చేయటం కూడా అనుమానమేనని బీజేపీ శ్రేణులు చర్చించుకొంటున్నాయి. బీజేపీ కుట్ర బట్టబయలు కావడంతో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తన ప్రచారాన్ని మధ్యలోనే ముగించి వెళ్లిపోయారు. ఓటమి భయంతో జ్వరమొచ్చిందని చెప్పి సానుభూతి పొందాలని చూసిన రాజగోపాల్రెడ్డి, బీజేపీ చర్యకు కకావికలం అవుతున్నారు. ‘రేపు జనానికి మొహమెట్లా చూపాలి..? ఇప్పటికే ప్రజలు మనమీద కోపంగా ఉన్నారు. ఈ పరిణామాలతో మునుగోడులో బీజేపీకి చావుదెబ్బ తప్పదు’ అని బీజేపీ నేతలే పేర్కొంటుండటం గమనార్హం.