హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొందామని రాష్ట్ర అగ్నిమాపకశాఖ డీజీ వై నాగిరెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ వట్టినాగులపల్లిలోని అగ్నిమాపకశాఖ శిక్షణా కేంద్రంలో 481 మంది ఫైర్మెన్లకు అధికారిక శిక్షణ ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. ఫైర్మెన్లు శిక్షణను సద్వినియోగం చేసుకొని.. రెస్క్యూ ఆపరేషన్లలో పౌరుల ప్రాణాలు కాపాడేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మొత్తం 534మందికి అపాయింట్మెంట్లు ఇవ్వగా 481 మంది శిక్షణకు హాజరయ్యారని, మిగిలిన వారు త్వరలోనే శిక్షణకు వస్తారని తెలిపారు. నాలుగు నెలల కాలంలో అన్ని రెస్క్యూ శిక్షణ సామగ్రిపై అవగాహన పెంచుకోవాలని ఫైర్మెన్లకు సూచించారు.