హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కేసులో గురువారం ఎన్ఐఏ మూడో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ 17వ నిందితుడు నోస్సామ్ మొహమ్మద్ యూనస్పై నేరారోపణలు మోపింది. యూనస్పై ఉపా చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నట్టు ఎన్ఐఏ తెలిపింది.
ఇదే కేసులో ఇప్పటివరకు 16 మంది అరెస్టు కాగా, వారిపై 120బీ, 153ఏ, యూఏ(పీ) 17,18,18A, 18బీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తెలంగాణ, ఏపీకి చెందిన పలువురిపై ఎన్ఐఏ అభియోగాలు మోపింది. ముస్లిం యువకులను రెచ్చగొట్టేలా కుట్రలకు పాల్పడినట్టు గుర్తించింది. భారత ప్రభుత్వం, ఇతర సంస్థలు, వ్యక్తులపై రెచ్చగొట్టే ప్రసంగాలను పీఎఫ్ఐ చేస్తున్నట్టు ఎన్ఐఏ చార్జ్షీట్లో పేర్కొన్నది.
రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా ముస్లిం యువకులను పీఎఫ్ఐ సంస్థలో బలవంతంగా చేర్చుకున్నట్టు తెలిపింది. వీరంతా 2047 నాటికి ఇండియాలో ఇస్లామిక్ పాలనను స్థాపించాలనే కుట్రకు ప్లాన్చేసినట్టు తమ విచారణలో తేలిందని ఎన్ఐఏ వెల్లడించింది. హింసాత్మక ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్ర పన్ని ఆ దిశగా ముస్లిం యువతకు శిక్షణ ఇస్తున్నట్టు తెలిపింది.
ఈ కుట్రను గుర్తించి 2022 జూలైలో నిజామాబాద్ పోలీసులు కేసు నమోదు చేయగా.. 2022 ఆగస్టు నుంచి ఎన్ఐఏ ఈ కేసు దర్యాప్తు చేస్తున్నది. 11 మంది నిందితులపై మొదటి చార్జిషీట్ దాఖలు చేయగా.. 2022 డిసెంబర్, 2023 మార్చిలో ఐదుగురు నిందితులపై రెండో చార్జిషీట్ దాఖలు చేసింది. తాజాగా గురువారం 17వ నిందితుడిపై 3వ చార్జిషీటు దాఖలు చేసింది.