హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 దరఖాస్తులకు తొలిరోజైన సోమవారం 3,895 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. టీఎస్పీఎస్సీ గ్రూప్-1కు దరఖాస్తుదారుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. పదిమంది అభ్యర్థులతో టీఎస్పీఎస్సీ అధికారులు ఫోన్లో మాట్లాడి ఇబ్బందులు, సమస్యలు ఏవైనా ఎదురయ్యాయా? అని అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తు సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదని, కేవలం 5 నుంచి 8 నిమిషాల్లోనే దరఖాస్తు ప్రక్రియ పూర్తయిపోయిందని అభ్యర్థులు తెలిపారని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ పేర్కొన్నారు. గ్రూప్-1కు దరఖాస్తు తేదీ రావడంతో వన్టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకునేందుకు, ఓటీఆర్ ఎడిట్పై అభ్యర్థులు ఆసక్తి చూపిస్తున్నారు. సోమవారం వరకూ కొత్తగా 68,793 మంది ఓటీఆర్ నమోదు చేసుకున్నారు. 1,54,785 మంది ఓటీఆర్ను ఎడిట్ చేసుకున్నారు. ఇప్పటివరకూ ఓటీఆర్ నమోదు, ఎడిట్ చేసుకున్న అభ్యర్థుల సంఖ్య 2,23,578కి చేరింది. టీఎస్పీఎస్సీలో 25,38,590 మంది అభ్యర్థులు ఓటీఆర్ చేసుకున్నారు. కొత్తగా వచ్చిన జోనల్ వ్యవస్థ ప్రకారం వీళ్లంతా ఓటీఆర్లో అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ చాలామంది నేటికీ ఓటీఆర్ అప్డేట్ చేసుకోవడం లేదు. టీఎస్పీఎస్సీ ప్రత్యేక శ్రద్ధతో రోజుకు లక్షమంది అభ్యర్థులకు మెయిల్స్ పంపిస్తున్నది. గ్రూప్-1కు మే 31వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. చివరిరోజు వరకూ వేచిచూడకుండా త్వరగా ఓటీఆర్ నమోదు, ఎడిట్ ప్రక్రియను పూర్తి చేయాలని, గ్రూప్-1కు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచిస్తున్నది.