11 ఏ టైప్ డోమ్స్ నిర్మాణం పూర్తి
దసరా నాటికి నిర్మాణం పూర్తి చేసే దిశగా పనులు
హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): నూతన సచివాలయ భవన నిర్మాణ పనులు 70 శాతం వరకు పూర్తయ్యాయి. ఏడు అంతస్తుల నిర్మాణం పనులు పూర్తి కాగా ఆ పైన డోమ్ల ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సచివాలయ భవనంపైన నాలుగు రకాలైన 34 డోమ్స్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఇప్పటివరకు 11 డోమ్స్ను ఏర్పాటుచేయగా రెండు నెలల్లో మిగిలినవి బిగిస్తామని అధికారులు చెపుతున్నారు.
డోమ్స్ నిర్మాణం పూర్తయితే సచివాలయ నిర్మాణం దాదాపుగా పూర్తయినట్లేనని అంటున్నారు. నూతన సచివాలయ భవనంపై ఏర్పాటుచేసే డోమ్లను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించారు. ‘ఏ’ టైప్ డోమ్ 23.6 ఫీట్లు, ‘బీ’ తరహా డోమ్లు 31 ఫీట్లు, ‘సీ’ టైప్ 21.6 ఫీట్లు, ‘డీ’ తరహా డోమ్లు అన్నిటికంటే పెద్దవి 54.8 ఫీట్లు ఉంటాయి. ‘ఏ’ టైప్ డోమ్లు 20 నిర్మిస్తుండగా.. ఒక్కోదానికి 5 టన్నుల ఐరన్ పడుతుంది. ‘బీ’ టైప్ డోమ్లు నాలుగు నిర్మిస్తున్నారు. వీటికి ఒక్కోదానికి 7 టన్నుల ఐరన్ పడుతుంది. ఎనిమిది ‘సీ’ టైప్ డోమ్లకు ఒక్కో దానికి నాలుగున్నర టన్నుల ఐరన్ పడుతుంది. ఇక ‘డీ’ టైప్ డోమ్లకు ఒక్కోదానికి 10 టన్నులకు పైగా ఐరన్ పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇలా డోమ్లకు 90 టన్నుల వరకు ఐరన్ అవసరమవుతుందని చెప్తున్నారు. ఇప్పటివరకు ‘ఏ’ టైపు డోమ్స్ 11 బిగించారు.