Birdflu | నర్సాపూర్ : బర్డ్ఫ్లూ వ్యాధి సోకి నాటు కోళ్లు మృతి చెందాయి. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన నాటుకోళ్ల వ్యాపారి పాత్లోత్ ప్రసాద్ 3500 నాటుకోళ్లను పెంచుతూ ఉపాధి పొందుతున్నాడు. బాయిలర్ కోళ్లనే కాకుండా నాటు కోళ్లను కూడా పెంచుతూ ఉపాధి పొందుతున్నాడు. ప్రసాద్ ఫామ్ పక్కనే గల బాయిలర్ ఫామ్లో బర్డ్ ఫ్లూ సోకడంతో అన్ని కోళ్లు మృతి చెందాయని, ఆ కోళ్ల ఫామ్కు కొద్ది దూరంలోనే తన నాటు కోళ్ల ఫామ్ ఉందని అందులో 3500 నాటు కోళ్లను పెంచుతుండగా బాయిలర్ కోళ్లకు వ్యాపించిన బర్డ్ ఫ్లూ తన నాటు కోళ్లకు కూడా వ్యాపించడంతో అన్ని మృతి చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నాటు కోళ్ల పిల్లల పెంపకానికి 8 లక్షల వరకు వెచ్చించానని అవి చనిపోవడంతో తీవ్రంగా నష్టపోయానంటూ లబోదిపోమంటున్నాడు. బోర్లు సైతం వేయించానని, తన నాటు కోళ్ల ఫామ్ వద్ద పుష్కలంగా నీళ్లు, దాన ఉన్నాయని ఇంతకుముందు 5 సార్లు నాటు కోళ్లను పెంచి విక్రయించానని, ఎప్పుడు ఇలా జరగలేదని, కేవలం బర్డ్ ఫ్లూ వాళ్లనే తన నాటు కోళ్లు చనిపోయాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరాడు.