SIM Cards | హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాల కట్టడిలో భాగంగా దాదాపు 33,028 సిమ్ కార్డులను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో బ్లాక్ చేయించింది. ఈ బ్యూరో ఏర్పడిన కొద్ది కాలంలోనే ఇంత భారీ సంఖ్యలో సిమ్లు పనిచేయకుండా చేసింది. వీటితోపాటు 3,768 ఐఎంఈఐ నంబర్లను సైతం బ్లాక్ చేయించింది. వినియోగదారులను ఆకట్టుకోవడానికి సర్వీసు ప్రొవైడర్లు విచ్చలవిడిగా సిమ్లను ఇచ్చేస్తున్నారు.
ఫ్రీ సిమ్.. విత్ వన్ మంత్ అన్లిమిటెడ్ డాటా ఇలా పలు ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు. దీంతో చాలా మంది సిమ్లను తీసుకొని దాని ఆఫర్లు అయిపోగానే పక్కనపెడుతున్నారు. ఇలాంటి నంబర్లతో సైబర్ నేరగాళ్లు రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. అయితే వీటికి అడ్డుకట్ట వేయాలని భావించిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. సర్వీసు ప్రొవైడర్లకు లేఖలు రాసి బ్లాక్ చేయిస్తున్నది. నేషనల్ సైబర్ క్రైమ్ సిబ్బంది సహకారాన్ని కూడా తీసుకుంటున్నది.