సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 15: క్రమశిక్షణతో చదివితే లక్ష్యం సాధించవచ్చని, పట్టుదలతో సాధన చేస్తే విజయం తథ్యమని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఇకపై ఉద్యోగ నియామకాల్లో ఎటువంటి ఆటంకాలూ ఉండబోవని, 317 జీవో తెచ్చింది నిరుద్యోగ యువత కోసమేనని స్పష్టంచేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎస్ ఫౌండేషన్(సావిత్రమ్మ ఫౌండేషన్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ అవగాహన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దామని చెప్పారు.
పుష్కలమైన నీళ్లు, నిధులతో అన్ని రంగాలనూ ఎవ్వరూ ఊహించని విధంగా అభివృద్ధి చేస్తున్నామని స్పష్టంచేశారు. ఏడేండ్లలో లక్షకు పైగా నియామకాలు పూర్తయ్యాయని, తాజాగా మరో 80 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఉద్యోగ అర్హతకు వయోపరిమితిని పెంచడం, జోన్ల వారీగా స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా చర్యలు తీసుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఎవరికి, ఎప్పుడు, ఏమివ్వాలో తెలిసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని.. కొంత ఆలస్యమైనా అందరి కడుపు నింపే గొప్ప మనసున్న మహా నాయకుడని కొనియాడారు. యువత సన్మార్గంలో పయనిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఎస్ ఫౌండేషన్ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సదస్సుకు జిల్లాకు చెందిన 1,680 మంది యువతీ యువకులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఎస్ ఫౌండేషన్ సీఈవో మాదంశెట్టి వీరన్న, సబ్జెక్టు నిపుణులు ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు, రామకృష్ణ (ఆర్కే) పాల్గొన్నారు.